జంగారెడ్డిగూడెం (చింతలపూడి): గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ. 2,73,457 ఆదాయం సమకూరినట్లు ఆలయ కమిటీ తెలిపింది. అలాగే సుమారు 1,950 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రూ.25 లక్షల వ్యయంతో నిర్మించనున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, ధర్మకర్తలు పాల్గొన్నారు.
ఆంజనేయస్వామి సన్నిధిలో...
మద్ది ఆంజనేయస్వామివారిని ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ముఖమండపంలో అర్చకులు వేదాశీర్వచనం గావించగా, ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారిణి ఆర్వీ చందన స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని బహుకరించారు.


