జంగారెడ్డిగూడెం (చింతలపూడి): మత్తుగా ఉపయోగించే ట్రామడాల్ ఇంజెక్షన్లను అక్రమంగా కొనుగోలు చేసి, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్న కేసులో మరో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ బి.వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ సూచనల మేరకు జంగారెడ్డిగూడెం సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై ఎన్. వీరప్రసాద్, సిబ్బందితో కలిసి పట్టణంలోని పలు మెడికల్ ఏజెన్సీలపై దాడులు నిర్వహించినట్లు చెప్పారు. గతంలో లక్ష్మీ శ్రీనివాస మెడికల్ ఏజెన్సీ యజమాని కాండ్రేగుల లక్ష్మణ సాయికిషోర్ను అరెస్ట్ చేయగా, అతనిచ్చిన సమాచారం ఆధారంగా విస్తృత దర్యాప్తు చేపట్టి ఈ అరెస్టులు చేసినట్లు పేర్కొన్నారు.
అరెస్టయిన నిందితులు
జ్యోతిక పెద్దింటి మెడికల్ హాల్ యజమాని ఏలూరి సతీష్, రూపా పెద్దింటి మెడికల్ ఏజెన్సీ యజమాని ఏలూరి దుర్గాప్రసాద్, అదే ఏజెన్సీలో పనిచేసే దేవ రాజశేఖర్, శ్రీ భవానీ మెడికల్ ఏజెన్సీకి చెందిన మాధవరపు శివకృష్ణ, మధ్యాహ్నపువారిగూడెంలోని చిరు మెడికల్ యజమాని తమ్మిశెట్టి చిరంజీవి
880 మత్తు ఇంజెక్షన్లు స్వాధీనం
నిందితుల నుంచి 780 ట్రామడెక్స్, 100 ట్రామెక్ ఇంజెక్షన్లతో పాటు విక్రయాలకు ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, సంబంధిత రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు వెల్లడించారు. యువతను పక్కదారి పట్టిస్తున్న మత్తు పదార్థాలు, ఇంజెక్షన్ల అక్రమ రవాణాపై వేగంగా స్పందించి, కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై ఎన్.వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై ఎం. కుటుంబరావు, క్రైమ్ ఏఎస్సై సంపత్, ఎన్.రాజేంద్ర, హెచ్సీ ఉమామహేశ్వరరావు, కానిస్టేబుళ్లు రమేష్, షాన్ బాబు, మణికంఠ, సత్యనారాయణ, రవికుమార్లను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ఆగిరిపల్లి: మండలంలోని శోభనాపురం గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఎస్సై హనుమంత్ నాగరాజు తన సిబ్బందితో కలిసి దాడి చేసి 8మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.11,600 నగదు, 7 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


