ద్వారకాతిరుమల: పెరుగుతున్న కాలుష్యం, రోజురోజుకూ భారమవుతున్న ఇంధన ధరలు, వాతావరణ మార్పుల ప్రభావం.. వీటన్నింటికీ ప్రత్యామ్నాయంగా ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వాహనాల (ఈవీ) వినియోగం వేగంగా విస్తరిస్తోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలకు భిన్నంగా విద్యుత్తో నడిచే ఈ వాహనాలు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు, వినియోగదారులపై ఇంధన వ్యయ భారాన్ని కూడా తగ్గిస్తున్నాయి. ఈవీల మరో ప్రత్యేకత ఏమిటంటే.. విద్యుత్ మోటార్లు సాంప్రదాయ ఇంజిన్ల కంటే నిశ్శబ్దంగా పనిచేస్తాయి. దీంతో శబ్ద కాలుష్యాన్ని తగ్గించడంలోనూ ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థ వైపు ప్రజలను నడిపించాలనే ఉద్దేశంతో ఏటా సెప్టెంబర్ 9న ప్రపంచ విద్యుత్ వాహనాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఆర్టీసీ కీలక అడుగులు వేస్తోంది. ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 1,050 ఎలక్ట్రిక్ బస్సులను ’పీఎం ఈ–బస్ సేవా’ కింద ప్రవేశపెట్టే ప్రణాళికలో ఉంది. దీని పూర్తి అమలుకు మార్చి 2027 నాటిని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 750 బస్సులను 11 నగరాలకు, మరో 300 బస్సులను తిరుమల – తిరుపతి మార్గానికి కేటాయించారు.
కాలుష్యానికి చెక్..
సాంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు గాలి కాలుష్యానికి ప్రధాన కారణాల్లో ఒకటి. అయితే, ఈవీల్లో టెయిల్పైప్ ఉద్గారాలు ఉండవు. ఫలితంగా నగరాలు, పట్టణాల్లో గాలి నాణ్యత మెరుగుపడేందుకు ఇవి దోహదపడతాయి. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈవీల వినియోగం పెరగడం వల్ల వాయు కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది.
ప్రయాణ ఖర్చు ఆదా
ఈవీ యజమానులకు ప్రధానంగా కలిగే ప్రయోజనం రోజువారీ ప్రయాణ ఖర్చు తగ్గడం. పెట్రోల్, డీజిల్తో పోలిస్తే విద్యుత్ను వినియోగించడం వల్ల కిలోమీటరుకు అయ్యే వ్యయం చాలా తక్కువ. రోజూ కార్యాలయాలు, వ్యాపారాలు, విద్యాసంస్థలు, ఇతర అవసరాల కోసం ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇది దీర్ఘకాలంలో భారీ మొత్తాన్ని ఆదా చేస్తుంది.
నిర్వహణ వ్యయం కూడా తక్కువే
అంతర్గత దహన ఇంజిన్ వాహనాలతో పోలిస్తే ఈవీల్లో కదిలే యాంత్రిక భాగాలు తక్కువగా ఉంటాయి. ఇంజిన్ ఆయిల్ మార్పు వంటి కొన్ని సాధారణ నిర్వహణ అవసరాలు ఉండవు. దీంతో సర్వీసింగ్, నిర్వహణ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. అయితే బ్యాటరీ ఆరోగ్యం, టైర్లు, బ్రేకులు, ఇతర సాధారణ నిర్వహణ అంశాలపై మాత్రం యజమానులు శ్రద్ధ వహించాలి.
చార్జింగ్ సౌకర్యాలు విస్తరిస్తే
ఈవీల వినియోగం పెరగడానికి అవసరమైన చార్జింగ్ మౌలిక వసతులు కూడా క్రమంగా విస్తరిస్తున్నాయి. ఇళ్ల వద్ద, కార్యాలయాల్లో, వాణిజ్య ప్రాంతాల్లో చార్జింగ్ సదుపాయాలు అందుబాటులోకి రావడం వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని కల్పిస్తోంది. సౌర విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులతో ఈవీ చార్జింగ్ను అనుసంధానిస్తే పర్యావరణ ప్రయోజనం మరింత పెరిగే అవకాశం ఉంది.
సవాళ్లూ ఉన్నాయి..
ఈవీలకు ప్రయోజనాలతో పాటు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. వాహనం కొనుగోలు ధర, బ్యాటరీ ఖర్చు, చార్జింగ్ సమయం, దూర ప్రయాణాల్లో చార్జింగ్ స్టేషన్ల లభ్యత వంటి అంశాలను కొనుగోలుదారులు ముందుగానే పరిశీలించాలి. వాహనం కొనుగోలు చేసేటప్పుడు బ్యాటరీ సామర్థ్యం, వారంటీ, చార్జింగ్ సదుపాయం, సర్వీస్ నెట్వర్క్, వాస్తవిక డ్రైవింగ్ రేంజ్ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో..
సుమారు ఈవీ టూ–వీలర్స్ (స్కూటీలు/బైక్లు) 18,500 – 20,000, కార్లు 1,200 – 1,500, ఆటోలు/మూడు చక్రాల వాహనాలు 2,500 – 3,000 వరకు ఉన్నాయి.
పర్యావరణ పరిరక్షణకు ‘ఈవీ’లే దిక్సూచి
వేగంగా విస్తరిస్తున్న వినియోగం
వినియోగదారులకు ఆదా.. ఆదాయానికి మించి ప్రయోజనాలు
నేడు ప్రపంచ విద్యుత్ వాహనాల దినోత్సవం
100 కిలో మీటర్ల ప్రయాణానికి అయ్యే ఖర్చు ఇలా..
వాహనం సగటు మైలేజ్ 100 కి.మీ ధర రూ.. 100 కి.మీ.
(లీటరుకు) కి.మీలు అవసరమయ్యేది ఖర్చు
పెట్రోల్ కారు 15 6.67 లీటర్లు 117.75/ లీటర్ 785
డీజిల్ కారు 20 5 లీటర్లు 95.20/ లీటర్ 476
ఈవీ కారు ఇంటి 08 12.5 యూనిట్లు 2/ యూనిట్ 25
(ఏసీ)ఛార్జింగ్
ఈవీ కారు మార్కెట్లో 08 12.5 20/ యూనిట్ 250
(డీసీ) ఛార్జింగ్


