తాడేపల్లిగూడెం మున్సిపల్ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ
తాడేపల్లిగూడెం: స్థానిక మున్సిపాలిటీలో కుంచనపల్లి, పడాల, ప్రత్తిపాడు, కొండ్రుపోలు, ఎల్.అగ్రహారం గ్రామాల విలీనంపై గత కొన్నేళ్లుగా హైకోర్టులో వివాదం నడుస్తోంది. ఈ కోర్టు లిటిగేషన్ల కారణంగా సుమారు ఏడేళ్లుగా గూడెం మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడం లేదు. ప్రస్తుతం ప్రత్యేకాధికారి, అధికారుల కౌన్సిల్ సంయుక్త పర్యవేక్షణలోనే పాలన సాగుతోంది. త్వరలోనే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశముండటంతో కోర్టు తీర్పు కోసం ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబరు 1న తీర్పు వస్తుందని భావించినప్పటికీ, సంబంధిత న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా పడుతూ వచ్చి, చివరకు మంగళవారం నాటికి చేరింది.
24కు కేసు వాయిదా
ఐదు గ్రామాల విలీనానికి సంబంధించి నమోదైన రెండు కేసులలో పిటిషనర్ల తరఫున వాదించాల్సిన న్యాయవాది మంగళవారం కోర్టుకు హాజరుకాలేదు. (పడాల, ఎల్.అగ్రహారం గ్రామాలకు ఒకరు, కుంచనపల్లి, ప్రత్తిపాడు, కొండ్రుపోలు గ్రామాలకు మరో న్యాయవాది కేసు నమోదు చేయగా.. వారిలో ఒకరు గవర్నమెంట్ ప్లీడర్గా వెళ్లడంతో ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు). ఆయన కూడా రాకపోవడంతో తుది వాదనల విచారణను హైకోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం తరఫున న్యాయవాది సాంబశివప్రసాద్ తన వాదనలు వినిపించారు.
మళ్లీ సవాల్ చేస్తే ఎన్నికలు ప్రశ్నార్థకమే
ఈ నెల 24న వెలువడే తుది తీర్పు విలీనానికి అనుకూలంగా వస్తే, ఆయా గ్రామాల ప్రజలు దానిని సవాల్ చేస్తూ మళ్లీ కోర్టును ఆశ్రయించే అవకాశముంది. దీంతో గూడెం మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై తీవ్ర అనిశ్చితి నెలకొంది.


