ఆగిరిపల్లి : మండలంలోని కల్లుటూరు, ఈదులగూడెం సరిహద్దుల్లోని కొండ పోరంబోకు గట్టుపై జరుగుతున్న గ్రావెల్ తవ్వకాల వలన తమ జీవనోపాధి పూర్తిగా దెబ్బతింటుందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 174లోని కొండగట్టుపై ఎల్అండ్టీ కంపెనీకి చెందినవారు అనుమతులు ఉన్నాయంటూ భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపి, లారీల్లో బయటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈదులగూడెం, కల్లుటూరుకు చెందిన రైతులు ఈ కొండపై అనేక సంవత్సరాలుగా జీవాలను మేపుకుంటూ, బోర్లు వేసుకుని వ్యవసాయం సాగు చేసుకుంటున్నారు. అమరావతికి గ్రావెల్ తరలించడం కోసం తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని రైతులు మండిపడ్డారు. మైనింగ్, పర్యావరణ అనుమతులు లేకుండా తవ్వకాలు ఎలా చేస్తారంటూ గ్రావెల్ తవ్వక ప్రాంతానికి వెళ్లి నిరసన తెలిపారు. ఈ ఆందోళన సమయంలో తెలుగుదేశం పార్టీ మండల కార్యదర్శి కొల్లిపర సాంబశివరావు అక్కడకు చేరుకుని గ్రామస్తులను బెదిరింపులకు గురిచేశారు. తవ్వకాలు చేస్తుంది తానేనని, ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని, కలెక్టర్కు ఫిర్యాదు చేసినా తమకు ఏమీ కాదని హెచ్చరించినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే తాము బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని, తవ్వకాలు నిలిపివేసే వరకు హైకోర్టును ఆశ్రయించి పోరాటం కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు.


