నరసాపురం రూరల్: మండలంలోని వేములదీవి కాపులకొడప శ్రీ వేంకటేశ్వరస్వామికి శనివారం ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పెద్దింటి అరుణ్కుమార్ ఆచార్యులు స్వామివారిని పూలతో సుందరంగా అలంకరించి, విశేష సేవలు, అభిషేకాలు జరిపించారు. ఈ వేడుకకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
టి.నరసాపురం: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో భక్తి, దేశభక్తి మిళితమైన అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆలయ ప్రధానార్చకుడు రవీంద్రబాబు స్వామివారి శివలింగాన్ని మువ్వన్నెల జాతీయ జెండా రూపంలో వర్ణశోభితంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ ప్రత్యేక అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక జేపీ రోడ్డులోని శ్రీ దంతులూరి జగన్నాథరాజు సత్రం అనుబంధ సంస్థ అయిన శ్రీ పద్మావతీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రావణ మాస మొదటి శనివారాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి సహస్ర దీపాలంకరణ, ఊంజల సేవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారు, అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేసి, వెయ్యి దివ్య దీపాల కాంతుల నడుమ అర్చకులు విశేష పూజలు జరిపారు. పూజా కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్ మంతెన రామ్కుమార్ రాజు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ఈఓ, అర్చక స్వాములు, ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి సేవలో తరించారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ) మెగా రుణమేళాను సోమవారం నగరంలో నిర్వహించనున్నట్టు ఆ బ్యాంక్ విజయవాడ రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. స్థానిక రామచంద్రరావుపేటలోని హోటల్ ఎన్ స్క్వేర్లో మేళా నిర్వహిస్తామని, వ్యవసాయ రంగానికి రుణాలు అందిస్తామన్నారు. అలాగే కోల్డ్ స్టోరేజ్, వేర్హౌస్ల ఏర్పాటుకు గరిష్టంగా రూ.50 కోట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు గరిష్టంగా రూ.100 కోట్లు, పౌల్ట్రీ వ్యాపారానికి గరిష్టంగా రూ.50 కోట్లు అందిస్తామన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఏలూరు (టూటౌన్): ప్రభుత్వ పాఠశాలల శానిటేషన్ వర్కర్లు, నైట్ వాచ్మెన్లకు రావాల్సిన 7 నెలల బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు జిల్లా కమిటీ నిర్ణయించింది. స్థానిక ఐఎఫ్టీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో యూనియన్ నేతలు ఈ వివరాలను వెల్లడించారు. గత ఐదారు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


