చింతలపూడి: వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డికి అభిమానులు, పార్టీ శ్రేణులు మంగళవారం కన్నీటి వీడ్కోలు పలికారు. అభిమానులు, కార్యకర్తల చివరి చూపు కోసం జానకి రెడ్డి భౌతికకాయాన్ని మంగళవారం ఉదయం చింతలపూడిలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి తీసుకువచ్చారు. అక్కడ నాయకులు, కార్యకర్తలు ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం చింతలపూడి నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర యర్రంపల్లి వరకు సాగింది. అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలిరావడంతో అంతిమయాత్ర జనసందోహంగా మారింది. శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు, వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి, చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.వెంకటరెడ్డి తదితరులు నివాళులర్పించారు. ‘జానకిరెడ్డి అమర్ రహే’ నినాదాల మధ్య అంతిమయాత్ర యర్రంపల్లికి చేరుకుంది. అనంతరం హిందూ స్మశాన వాటికలో జానకిరెడ్డి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించి చితికి నిప్పంటించారు.


