ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యారంగంలో ఏలూ రు జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. సోమవారం ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన షైనింగ్ స్టార్స్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కలెక్టర్తో పాటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగాషైనింగ్ స్టార్స్ కార్యక్రమం ద్వారా 2025–26 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. పదో తరగతిలో ప్రతిభ చాటిన 187 మందికి రూ.37.40 లక్షలు, ఇంటర్మీడియట్లో రాణించిన 35 మంది విద్యార్థులకు రూ.7 లక్షల విలువైన నమూనా చెక్కులను అతిథులు అందజేశారు. ప్రతిభావంతులైన ఈ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాలు, మెడల్స్ను అందించి సన్మానించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలను మార్చే బడి ఒక దేవాలయం లాంటిదన్నారు. విద్యాశాఖ రూపొందించిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ను సమర్థవంతంగా అమలు చేసి, జిల్లాలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు కృషి చేసిన అందరినీ అభినందించారు. డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ, డీఐఓ కె.యోహాను తదితరులు పాల్గొన్నారు.


