ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్ర దత్తత ఆలయం లక్ష్మీపురంలోని సంతాన వేణుగోపాల జగన్నాథ, వేంకటేశ్వరస్వామివారి సన్నిధిలో రథోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయం నుంచి ద్వారకాతిరుమల క్షేత్రానికి రథయాత్ర నేత్రపర్వంగా సాగింది. సుందరంగా అలంకరించిన రథంలో సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుని దారు విగ్రహాలను వేంచేపు చేసి ప్రత్యేక పూజల అనంతరం రథయాత్ర ప్రారంభించారు. ఆలయ ఏఈఓ ఐ.రమణరాజు, ఎలక్ట్రికల్ డీఈ టి.సూర్యనారాయణ, సూపరింటిండెంట్ జి.సుబ్రహ్మణ్యం రథం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథం ముందుగా ఆలయం చుట్టూ తిరిగి అశేష భక్తజనం నడుమ ద్వారకాతిరుమల క్షేత్రానికి చేరుకుంది. అక్కడ భక్తుల దర్శన అనంతరం తిరిగి లక్ష్మీపురంలో ఆలయానికి చేరుకుంది.


