● జలవనరుల శాఖ మంత్రిఇలాకాలోనే నీటి ఎద్దడి
● నెర్రలు తీసిన పొలాలు
● ట్యాంకర్లతో నారుమడికి నీరందిస్తున్న రైతు
పాలకొల్లు సెంట్రల్: ‘అడవిలో ఆకు కరువు.. చెరువులో నీళ్లు కరువు’ అన్నట్టు ఉంది జలవనరులశాఖ మంత్రి ఇలాకాలో పరిస్థితి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పాలకొల్లు నియోజకవర్గం పోడూరు మండలం వేడంగిలో నీటి ఎద్దడి తలెత్తింది. నారుమడులకు నీరు లేక భూమి నెర్రలు తీయడంతో రైతు ట్యాంకర్లతో నీరు అందిస్తున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. వేడంగికి చెందిన దుప్పనపూడి గజేంద్రుడు గ్రామంలోని గొల్లేపాడు ప్రాంతంలో మూడెకరాల భూమిని కౌలుకు చేస్తున్నారు. ఇటీవల 20 సెంట్లలో నారుమడి వేశారు. నీరందకపోవడంతో గత్యంతరం లేక మూడు ట్యాంకర్ల నీటిని తెచ్చి నారుమడిని తడుపుతున్నారు. అయినా నీరు సరిపోలేదని అంటున్నారు. ట్యాంకర్కు రూ.1,500 చొప్పున రూ.4,500 ఖర్చయిందని వాపోయారు. మధ్యాహ్నం మొదలుపెట్టి రాత్రి 9.30 గంటల వరకు నారుమడిని కాపాడుకునేందుకు తంటాలు పడ్డారు. గొల్లేపాడు ప్రాంతంలో సుమారు 70 ఎకరాల ఆయకట్టు పరిస్థితి ఇలానే ఉందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. సాగునీటికి కొరత లేదని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియజేసేందుకు ఈ సంఘటన అద్దం పడుతోంది.


