వైద్యాధికారుల అప్రమత్తం
ఏలూరు టౌన్: రాష్ట్రంలోని కడప, రాజంపేట ప్రాంతాల్లో ఇద్దరు కోవిడ్ (కరోనా) బారినపడి మృత్యువాతకు గురికావటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఏలూరు సర్వజన ఆస్పత్రి (జీ జీహెచ్)లో ప్రత్యేకంగా కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యా మల ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, అప్రమత్తంగా ఉండాలనీ, అనారోగ్యంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆమె సూచించారు. ఆక్సిజన్ సరఫరా, సాధారణ రోగులకు దూరంగా ఉండేలా వార్డును అందుబాటులో ఉంచారు. త్రీటీస్లో భాగంగా టెస్ట్–ట్రాక్–ట్రీట్ విధానంతో ముందుకు వెళ్లేలా చర్యలు చేపట్టారు. కరోనా లక్షణాలైన జ్వరం, పొడిదగ్గు, ఆయాసం, గొంతునొప్పి, ఊపిరితిత్తుల సమస్య వంటివి ఉంటే ఆలస్యం చేయకుండా కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఏలూరు జిల్లాలో ప్రస్తుతానికి కోవిడ్ లక్షణాలతో ఎవరినీ గుర్తించలేదని వైద్యులు చెబుతున్నారు.


