గంట సేపు వేచి ఉన్నా..
గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలో ఆన్లైన్ సేవలకు శనివారం ఉదయం అంతరాయం ఏర్పడింది. దీంతో స్వామివారి దర్శనం, మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా కల్యాణకట్ట్ట వద్ద మొక్కులు తీర్చుకునే భక్తులు టికెట్ల కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచి సర్వర్లో సమస్య తలెత్తడంతో ఆన్లైన్ సేవలు నెమ్మదించాయి. కొంతసేపు పనిచేసిన సర్వర్ మధ్య మధ్యలో నిలిచిపోవడంతో టికెట్ల జారీ ప్రక్రి య మందగించింది. దీంతో కల్యాణకట్ట ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది.
ఆఫ్లైన్లోనూ సమస్యలే..
సమస్యను గుర్తించిన దేవస్థానం అధికారులు బ్యాంకు పీఓఎస్ మెషీన్ల ద్వారా ఆఫ్లైన్ సేవలు ప్రారంభించినా, కొంత సమయం పాటు అవి కూడా మొరాయించాయి. కియోస్క్ మెషీన్లు సైతం నెమ్మదిగా పనిచేయడంతో భక్తుల నిరీక్షణ మరింత పెరిగింది. దీంతో సిబ్బంది కేశఖండనశాల వద్ద ప్రత్యేకంగా కంప్యూటర్ ఏర్పాటు చేసి టికెట్లు జారీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే సర్వర్ సమస్య కొనసాగడంతో ఆ ప్రయత్నాలు కూడా సకాలంలో ఫలించలేదు.
కౌంటర్ల వద్ద భారీ రద్దీ
దర్శనం టికెట్లు, ప్రసాదాల విక్రయాల కౌంటర్ల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆన్లైన్ సేవా కౌంటర్ల వద్ద భక్తులు బారులు తీరారు. చిన్నపిల్లలు, వృద్ధులతో వచ్చిన వారు గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో అసహనం వ్యక్తం చేశా రు. మనమిత్ర వాట్సాప్ సైతం పనిచేయకపోవడంతో భక్తులు గగ్గోలు పెట్టారు. మధ్యాహ్నం వరకూ ఆన్లైన్ కష్టాలు కొనసాగాయి.
కల్యాణకట్ట ప్రాంతంలో ఏర్పాటుచేసిన కంప్యూటర్ వద్ద, కియోస్క్ మెషీన్ వద్ద పోటెత్తిన భక్తులు
కేశఖండనశాల వద్ద టికెట్ అడిగితే సర్వర్ పనిచేయడం లేదన్నారు. దీంతో గంట సమయం అక్కడే వేచి ఉన్నా. ఆ తర్వాత దర్శనం టికెట్ కోసం మరో గంటకు పైగా సమయం పట్టింది. ఇన్ని ఇబ్బందులు ఎప్పుడూ పడలేదు. దేవదాయశాఖ అధికారులు భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సాంకేతిక సమస్యలను పరిష్కరించాలి.
– బేతే సురేష్, మల్లాయిగూడెం, అశ్వారావుపేట మండలం


