2000లో జిల్లాలో సత్కారం
● స్వర సామ్రాజ్ఞి జానకికి ఘన నివాళి
● భీమవరంలో కళాకారుల సంతాపం
భీమవరం: ఆమె కంఠంలో పలకని స్వరం లేదు.. రస హృదయాలను ఆనంద డోలికల్లో ఓలలాడించిన పాటల సామ్రాజ్య నాయకి ఆమె. గంధర్వ గాయకి.. ఆ సురాగ, సరాగ మాలిక పేరే ఎస్.జానకి అని వక్తలు కొనియాడారు. భీమవరం పట్టణ కళాకారుల సంఘం, శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఆదివారం భీమవరంలో ప్రముఖ గాయని ఎస్.జానకి సంతాప సభ నిర్వహించారు. కళారంజని నాటక పరిషత్ అధ్యక్షుడు జవ్వాది శ్రీనివాస్, అఖిల భారత శోభన్బాబు సేవా సమితి అధ్యక్షుడు భట్టిప్రోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ 65 ఏళ్లుగా పాటకి ప్రాణం పోసిన మహా గాయనీ జానకి అని, ఆమె గొంతు విప్పితే ప్రకతి కూడా తన్మయత్వంలో మునిగిపోతుందన్నారు. రచయితలు కలిగొట్ల గోపాలశర్మ, దొంతబత్తుల నాగేశ్వరరావు, డా.ఎస్.సత్యనారాయణరాజు మాట్లాడుతూ దేశంలోని మొదటి నలుగురు మహిళా గాయకుల్లో ఒకరిగా జానకి గుర్తింపు పొందారన్నారు. తన స్వర జీవితం మొదలైన మొదటి ఏడాదిలోనే ఆరు భాషల్లో వంద పాటలు పాడిన ఘనత ఆమెదన్నారు. ఇప్పటికీ అదే ఒక రికార్డుగా నిలిచిపోయిందన్నారు. కార్యక్రమ నిర్వాహకుడు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ 1977లో పదునారు వయదినిలే, 1980లో ఒప్పోల్, 1984లో సితార, 1993లో దేవర్ మగన్ చిత్రాల్లో పాడిన పాటలకు ఉత్తమ గాయనిగా ఆమె పురస్కారాలు పొందారన్నారు. 13 సార్లు కేరళ, 6 సార్లు తమిళనాడు, 10 సార్లు ఆంధ్రరాష్ట్ర బహుమతులు, కర్నాటక, ఒడిసా రాష్ట్ర బహుమతులు ఒక్కొక్కటి చొప్పున ఆమెకు దక్కా యన్నారు. 1987లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారం ప్రదానం చేసిందన్నారు. 2013లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించగా వివిధ కారణాల తో ఆ పురస్కారాన్ని ఆమె తిరస్కరించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అరసవల్లి సుబ్రమణ్యం, వి జ్జురోతి రాఘవులు, కొండ్రు శ్రీనివాస్, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మవారి ఆలయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని 2000లో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ సినీ గాయని ఎస్.జానకిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లాకు విచ్చేశారు.


