ఏలూరు టౌన్: ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ శబ్దకాలుష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ హెచ్చరించారు. ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏలూరు పాతబస్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ సీఐ ఎస్.లక్ష్మణరావు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి వాహన తనిఖీలు చేశారు. 15 స్పీకర్ బాక్సులు, 225 ఎల్ఈడీ లైట్లు, 50 మోటారు సైకిళ్ల సైలెన్సర్లు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో మార్పులు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనాలకు అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసినా... మోటారు సైకిళ్లకు భారీ శబ్దాలు చేసే సైలెన్సర్లు పెట్టినా చర్యలు తప్పవన్నారు.
కైకలూరు : కొల్లేటికోట పెద్దింట్లమ్మ ఆలయ హుండీ కానుకలను బుధవారం దేవదాయ ధర్మదాయ శాఖ అధికారి ఎ.పవన్కుమార్ పర్యవేక్షణలో ఆలయ ధర్మకర్తలమండలి చైర్మన్ వెంకన్నబాబు ఆధ్వర్యంలో లెక్కించారు. 105 రోజులకు గాను రూ.16,63,951 ఆదాయం లభించిందని ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు తెలిపారు. కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
వేలేరుపాడు: జగన్నాఽథపురం గ్రామంలో ఎండీ ఇబ్రహీంకు చెందిన పెంకుటిల్లు బుధవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. అంతా నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో ఇంట్లో దాచిన రూ.రెండున్నర లక్షల నగదుతోపాటు ఇనుప బీరువాలు, వంట పాత్రలు, ఎల్ఈడీ టీవీ, మంచాలు, బట్టలు, ఇతరత్రా వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. సుమారు రూ.15 లక్షల ఆస్తినష్టం సంభవించింది. ఈ ఇంట్లో ఉంటున్న ఎండీ నయీమ్, నఖీమ్ కుటుంబాలు కట్టుబట్టలతో బయటపడ్డాయి. కుక్కునూరు నుంచి వచ్చిన ఫైర్ ఇంజన్ మంటలను అదుపు చేసింది. బాధితులను వేలేరుపాడు తహశీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ శ్రీహరి, ఎస్సై నవీన్, వీఆర్ఓ బుడిపిటి సంగీతరావు పరామర్శించారు. తక్షణ ప్రభుత్వ సాయంగా నిత్యావసర వస్తువులు అందజేశారు.
భీమవరం: భీమవరం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టౌన్హాల్పై బుధవారం రాత్రి పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడికి సంబంధించి రెగ్యులర్ తనిఖీల్లో భాగంగానే దాడి చేశామని, ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ కార్యకలపాలు చోటు చేసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసుల దాడిలో పలువురు రాజకీయ ప్రముఖులు పేకాడుతూ పట్టుబడ్డారని, రాజకీయ పెద్దల జోక్యంతో కేసు లేకుండా చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
నరసాపురం రూరల్: వివిధ పనుల నిమిత్తం ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తూ చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నవారికి, విద్యార్థులకు న్యాయసహాయం అందించేందుకు ప్రత్యేక న్యాయ సహాయ కేంద్రంను ప్రారంభించినట్లు నరసాపురం 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎ వాసంతి తెలిపారు. నరసాపురం మండలం రుస్తుంబాద గ్రామంలోనిని ఫ్లెయిజ్ మెమోరియల్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఆఫ్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో న్యాయమూర్తి వాసంతి మాట్లాడారు. ప్రత్యేక న్యాయ సహాయ సెంటర్లో ప్యానల్ లాయర్గా కొప్పినీడి చిట్టి పద్మజ, పారా లీగల్ వాలంటీర్ గా బొడ్డు కృష్ణ భగవాన్ వ్యవహరిస్తారన్నారు. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు వీరు అందుబాటులో ఉంటారన్నారు.


