బుట్టాయగూడెం: పాఠశాల స్థాయి కుదింపుపై గత 27 రోజులుగా పులిరామన్నగూడెంలో గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు చేపట్టిన ఆందోళన కలెక్టర్ హామీతో ఎట్టకేలకు ముగిసింది. గ్రామాభివృద్ధి కమిటీ ప్రతినిధులు మూలెం రమేష్, మడకం వెంకటేశ్వరరావు, తామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ యు.ఏసుబాబు బుధవారం సాయంత్ర విలేకరులకు వివరాలు వెల్లడించారు. పాఠశాలలో 8, 9, 10 తరగతులు రద్దు చేయడం వల్ల సుమారు 20 గ్రామాలకు చెందిన విద్యార్థులు చదువులకు దూరమవుతారని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, కలెక్టర్ కె.వెట్రిసెల్వి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. పాత పద్ధతిలోనే తరగతులు కొనసాగించాలని, హాస్టల్ సదుపాయం కూడా ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. అయితే నూటికి నూరుశాతం విద్యార్థులు పాఠశాలలకు హాజరైతే తరగతులు యథాతథంగా కొనసాగేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో పాఠశాల ఎదుట చేస్తున్న ఆందోళన విరమించినట్లు మాజీ ఎంపీటీసీ ఏసుబాబు తెలిపారు. అలాగే గురువారం ఉదయం నుంచి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నూటికి నూరు శాతం విద్యార్థులను పాఠశాలలో చేర్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు మడకం పాపమ్మ, మొడియం వసంత, బన్నే పూర్ణ, బట్టు సురేష్, కుంజా వెంకటేశ్వరరావు, బండార్లు శ్రీను, గడుసుకోటి నవీన్కుమార్, తదితరులు పాల్గొన్నారు.


