
ఏలూరు టౌన్: తాపీ పనులు ముగించుకుని బైక్పై ఇంటికి వెళుతుండగా ఆటో ఢీకొనడంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి. పెదవేగి మండలం భోగాపురానికి చెందిన అబ్బదాసు ఏసుబాబు (35), బక్కతట్టి వెంకటేశ్వరరావు (25) తాపీ పనులు చేసుకుని జీవిస్తున్నారు. వీరిద్దరూ ఆదివారం రాత్రి పనులు ముగిసిన అనంతరం వట్లూరు నుంచి భోగాపురంలోని ఇళ్లకు బైక్పై బయలుదేరారు. వట్లూరు శివారు సమీపంలో వేగంగా వస్తున్న ఆటో ఎదురుగా వచ్చి వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఏసుబాబు, వెంకటేశ్వరరావు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఏలూరు త్రీటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం తీరును పరిశీలించారు. మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. సోమవారం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.19 కోట్లు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో సోమవారం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగింది. ఈ లెక్కింపులో శ్రీవారికి విశేష ఆదాయం సమకూరింది. గడిచిన 14 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ.1,19,48,451 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు చెప్పారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 91 గ్రాముల బంగారం, 3.012 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రద్దు అయిన పాత రూ.2 వేలు, రూ.వెయ్యి, రూ.500 నోట్ల ద్వారా రూ.40,500 లభించినట్టు తెలిపారు.
డాగ్ స్క్వాడ్ పనితీరు తనిఖీ
భీమవరం: పోలీసు శాఖలో డాగ్ స్క్వాడ్ పనితీరును ఎస్పీ యు.రవిప్రకాష్ పరిశీలించారు. వార్షిక పనితీరు పరీక్షల్లో భాగంగా సోమవారం ఎక్స్క్లూజివ్ డాగ్స్కి ఒబీడీఎస్ టెస్ట్, ఎక్స్ క్లూజివ్ ప్రాంతంలో తనిఖీ, అనుమానాస్పద వస్తువులు డ్రగ్స్ తనిఖీలు, వెహికల్ సెర్చ్, రద్దీగా ప్రాంతాల్లో అనుమానిత బ్యాగుల తనిఖీ, ట్రాకింగ్ తదితర అంశాల్లో పరీక్షలు నిర్వహించారు. ఏఆర్ డీఎిస్పీ ఎంవీవీ సత్యనారాయణ, ఆర్ఐ శ్రీకాంత్, మోసెస్ తదితరులు పాల్గొన్నారు.


హుండీ నగదు లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది