అంతరిక్షంలో మనవాడు! | Sakshi Editorial On Indian Air Force Group Captain Subhanshu Shukla | Sakshi
Sakshi News home page

అంతరిక్షంలో మనవాడు!

Jun 26 2025 12:28 AM | Updated on Jun 26 2025 12:28 AM

Sakshi Editorial On Indian Air Force Group Captain Subhanshu Shukla

నాలుగు దశాబ్దాల అనంతరం రోదసి నుంచి భారతీయ స్వరం మోగింది. మన వైమానిక దళం గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లాతోపాటు అమెరికా, పోలెండ్, హంగేరీలకు చెందిన మరో ముగ్గురు వ్యోమగాములు స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ అంతరిక్ష నౌకలో బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 12.01 నిమిషానికి 28 గంటల అంతరిక్షయాత్ర ప్రారంభించారు. వీరు అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కు చేరుకుని 14 రోజులపాటు దాదాపు 60 పరిశోధనలు చేస్తారు. ‘మేం భూకక్ష్యలో తిరుగుతున్నాం. 

భారత మానవ అంతరిక్ష కార్యక్రమం మొదలైంద’ంటూ శుభాంశు శుక్లా పంపిన సందేశం ఈ మొత్తం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న శాస్త్రవేత్తల్లో భావోద్వేగం కలిగించింది. ఎప్పుడో 1984లో రాకేష్‌ శర్మ అంతరిక్ష యాత్ర చేశాక భారత్‌ నుంచి మరొకరు వెళ్లటం ఇదే ప్రథమం. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ యాత్ర ప్రారం¿¶ మైంది. గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఐఎస్‌ఎస్‌... ప్రతి 90 నిమిషాలకూ భూకక్ష్యలో ఒక రౌండ్‌ పూర్తిచేస్తుంది. ఆ కారణంగా మన శుభాంశు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములు రోజూ 16 సూర్యోదయాలనూ, 16 సూర్యాస్తమయాలనూ వీక్షిస్తారు. 

అవనిపై ఎలావున్నా అంతరిక్షంలో దేశాల మధ్య ఇంతవరకూ కొనసాగుతున్న సహకారానికీ, సమన్వయానికీ ఐఎస్‌ఎస్‌ ఒక ప్రతీక. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, రష్యా సంస్థ రోస్‌కాస్మోస్, జపాన్‌ సంస్థ జాక్సా, కెనడా అంతరిక్ష సంస్థ సీఎస్‌ఏలు ఉమ్మడిగా ఐఎస్‌ఎస్‌ నిర్మాణానికి ముందుకు కదిలాయి. అంతరిక్షంలో ప్రపంచ దేశాలన్నీ పరస్పరం సహకరించుకోవాలని, దాన్ని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించాలని, అక్కడి పరిశోధనల ఫలితాలు సమస్త మాన వాళికి అందించాలన్న లక్ష్యాలతో ఐఎస్‌ఎస్‌కు అంకురార్పణ జరిగింది. 

రెండున్నర దశాబ్దాల క్రితం గనుక ఇదంతా కుదిరింది. వర్తమానంలో ఇది సాధ్యమయ్యేదా? ప్రఖ్యాత సైన్స్‌ ఫిక్షన్‌ రచయిత ఆర్థర్‌ సి. క్లార్క్‌ చాన్నాళ్ల క్రితం ‘ఈ విశాల విశ్వంలో రెండే రెండు సంభావ్యతలుంటాయి... అవి–మానవాళి ఒంటరైనా కావాలి లేదా కాకపోవాలి’ అన్నారు. సకల అంతరిక్ష యాత్రల సారాంశం దాన్ని ఛేదించటమే. ఈ క్రమంలో ఐఎస్‌ఎస్‌ ఒక సాధనం. 

ప్రయోగశాలగా, భిన్న సాంకేతికతల నిగ్గుతేల్చేదిగా భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో సేవలందిస్తున్న ఐఎస్‌ఎస్‌ ఇప్పటికి భిన్న శాస్త్రాల్లో 4,000 ప్రయోగాలకు వేదికైంది. జీవశాస్త్రం మొదలుకొని ఔషధాల వరకూ... భూ విజ్ఞాన శాస్త్రాలు మొదలుకొని భౌతిక శాస్త్రం వరకూ... పర్యావరణ పర్యవేక్షణ నుంచి అంతరిక్ష అన్వేషణ వరకూ ఎన్నెన్నో అంశాల్లో ఐఎస్‌ఎస్‌ వ్యోమగాములకు తోడ్పాటునందిస్తోంది. 

గురుత్వాకర్షణ శక్తి బలంగావుండే భూ వాతావరణంలో కొన్ని కొన్ని పరిశోధ నలు అసాధ్యమవుతాయి. అత్యంత సూక్ష్మ గురుత్వాకర్షణ కలిగి భారరహిత స్థితిలో ఉండే ఐఎస్‌ఎస్‌లో సంక్లిష్టమైన పరిశోధనలూ, ప్రయోగాలూ చేయటం, వాటినుంచి ఫలితాలు రాబట్టడం ఎంతో సులభం. ఇవి మనిషి జీవితాన్ని సుఖవంతం చేయగల అనేక సృజనాత్మక సాంకేతికతల ఆవిష్కరణకు తోడ్పడ్డాయి. 

కమ్యూనికేషన్ల రంగంలో, వనరుల యాజమాన్య నిర్వహణలో, తాగు నీరు స్వచ్ఛతకు వినియోగించే సాంకేతికతల రూపకల్పనలో, అంతరిక్ష యాత్రకు పనికొచ్చే అధు నాతన సాంకేతికతల అభివృద్ధిలో ఈ పరిశోధనలు ఉపయోగపడ్డాయి. అంతేకాదు... మానవాళి భవిష్యత్తు అంతరిక్ష అన్వేషణలకు ఐఎస్‌ఎస్‌ వేదికవుతున్నది. 

ఐఎస్‌ఎస్‌ భూమ్మీద రూపొందించి ప్రయోగించింది కాదు. అది కొన్ని రోజుల్లోనో, నెలల్లోనో పూర్తయినది కూడా కాదు. అందుకు దాదాపు పదమూడేళ్లు పట్టింది. అందులోని విడిభాగాల్లో ఎవరేమి తయారుచేయాలో, ఎప్పుడు పట్టుకెళ్లాలో సమగ్ర ప్రణాళికలు రూపొందించుకోగా, 1998 నవంబర్‌లో మొదలుపెట్టి 2011 వరకూ పునర్వినియోగ అంతరిక్ష నౌకలద్వారా, రష్యన్‌ రాకెట్ల ద్వారా 30 దఫాలు వందకుపైగా ఐఎస్‌ఎస్‌ విడిభాగాలు, సౌరశక్తి ప్యానెళ్లు, కేబుళ్లు వగైరాలు చేర్చారు. 

వ్యోమగాములు స్పేస్‌వాక్‌ చేస్తూ ఈ కేంద్రానికి రూపకల్పన చేశారు. నిద్రపోవటానికీ, తిండికీ, వ్యాయామాలకూ, పరిశోధనలకూ ఇక్కడి నుంచి ప్రయోగించిన మాడ్యూళ్లు తోడ్పడ్డాయి. మొదట్లో ఇది గరిష్ఠంగా 2020 వరకూ పనిచేయొచ్చని అంచనా వేయగా ఇప్పటికీ నిక్షేపంలా ఉంది. 

తాజా అంచనా ప్రకారం 2030తో దీని జీవితకాలం పూర్తవుతుందని, ఆ తర్వాత కక్ష్య తప్పించి నేలపై పడేవిధంగా చర్యలు తీసుకోవచ్చని భావిస్తున్నారు. కానీ ట్రంప్‌ ఏలుబడి మొదల య్యాక 2030 కన్నా ముందే దాన్ని దించేయాలని ఎలాన్‌ మస్క్‌ వాదించటం మొదలుపెట్టారు. ప్రస్తుతం మస్క్‌ స్థానమేమిటన్న దాన్నిబట్టి ఐఎస్‌ఎస్‌ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. 

మామూలుగా దూరప్రాంతాలకు వెళ్లినప్పుడే ఇంటిల్లిపాదీ ఎంతో భావోద్వేగానికి లోనవు తారు. అంతరిక్ష యాత్రంటే చెప్పేదేముంది? అందులో సాహసమూ, సమస్యలూ కలగలిసి ఉంటాయి. ఎన్నో త్యాగాలకు సిద్ధపడాలి. శిక్షణ కోసం అయినవాళ్లకు దూరంగా ఉండాలి. కష్టతరమైన వ్యాయామాలు తప్పనిసరి. శుభాంశు వీటన్నిటినీ తట్టుకుని నిలబడ్డాడు. వాయుసేన నుంచి అంతరిక్షయాత్ర వైపు అడుగులేశాడు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టు ఇప్పుడు 140 కోట్లమంది భారతీయుల ఆకాంక్షలనూ, నమ్మకాలనూ మోసుకెళ్లాడు. యువతకు స్ఫూర్తిగా నిలిచాడు.

శుభాంశు యాత్ర దిగ్విజయం కావాలని, మరో ముగ్గురితో కలిసి ఆయన సాగించే ప్రయోగాలూ, పరిశోధనలూ మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని దేశ పౌరులంతా ఆకాంక్షిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement