పిఠాపురం: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని దత్తాత్రేయుని జన్మస్థలం పిఠాపురంలో భక్తులు పోటెత్తుతున్నారు. స్థానిక శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం, పాదగయ క్షేత్రం, అనఘాదత్త క్షేత్రం, గోపాల్బాబా ఆశ్రమాలకు తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి ఏటా రెండు లక్షలకు పైగా భక్తులు రాఖీ పౌర్ణమికి వస్తుంటారు. గురు, శుక్ర వారాల్లో పౌర్ణమి ఉండడంతో ఇప్పటికే మరాఠీ భక్తులు ఇక్కడికి చేరుకున్నారు.
మరాఠీలదే ముఖ్యపాత్ర
మహారాష్ట్ర అంటే ఆధ్యాత్మికంగా మనకు గుర్తుకు వచ్చేది షిర్డీ సాయి ఆలయం. దేశం నలుమూలల నుంచి భక్తులు అక్కడకు వెళ్తుంటే ఆ రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు తమ ఇలవేల్పు శ్రీపాద శ్రీ వల్లభుని దర్శనానికి పిఠాపురం సంస్థానానికి వస్తుంటారు. అత్రి అనసూయల వర ప్రసాదుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారంగా దత్తాత్రేయుడు జన్మించినట్టు చరిత్ర చెబుతోంది. సర్వ వ్యాపితుడై దిక్కులే అంబరములుగా ఉన్న స్వామి వారిని దిగంబరుడిగా సంబోధిస్తారని భక్తులు చెప్తుంటారు. దత్తాత్రేయుడి ప్రధమావతారం శ్రీపాద శ్రీవల్లభుడిగా నడయాడిన ప్రాంతం కాబట్టి ఈ ఆలయానికి శ్రీపాద శ్రీవల్లభ సంస్థానమని పేరు వచ్చినట్టు పూర్వికులు చెప్తారు. దీంతో మరాఠీ భక్తులు దత్తాత్రేయుడిని తమ సోదరుడిగా భావించి ఆనవాయితీగా రాఖీలు కడుతుంటారు.
రాఖీ పౌర్ణమికి విస్తృత ఏర్పాట్లు
దత్తునికి రక్షా బంధనం చేయడానికి వస్తున్న మహారాష్ట్ర భక్తులు
పిఠాపురంలో నేటి నుంచి
రాఖీ పౌర్ణమి ఉత్సవాలు


