తొండంగి: మండలంలోని బెండపూడి జాతీయ రహదారిపై పోలవరం, పుష్కర కాలువ వద్ద డైవర్షన్ వంతెనల నిర్మాణ పనులు పూర్తి కావొస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రధాన రహదారికి రాజమహేంద్రవరం, విశాఖ రెండు వైపులా వాహనాల మళ్లింపు కోసం డైవర్షన్ వంతెనలు నిర్మించారు. ప్రస్తుతం అప్రోచ్ రోడ్ల పనులు జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో డైవర్షన్ వంతెనలపై నుంచి వాహనాల రాకపోకలకు అనుమతించనున్నారు. అనంతరం ప్రధాన రహదారిని తొలగించి వంతెనల నిర్మాణం ప్రారంభించనున్నారు. అయితే ఈ ప్రాంతంలోనే బెండపూడి గ్రామంలోకి వెళ్లే ప్రధాన జంక్షన్ కావడంతో ఇప్పటికే పలు ప్రమాదాలు జరిగే ప్రదేశంగా ఉంది. ఈ నేపథ్యంలో డైవర్షన్ వంతెనల అప్రోచ్ కూడా రావడంతో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పోలవరం, నేషనల్ హైవే అధికారులు ఈ ప్రాంతంలో తగిన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా తమ్మయ్యపేట శివారు విద్యుత్ సబ్ స్టేషన్ జంక్షన్ జాతీయ రహదారి నుంచి రావికంపాడు వెళ్లే రహదారిలో కూడా వంతెన పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ రహదారిలో కూడా వాహనాల రాకపోకలు నిలిపివేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. త్వరలో ఈ పనులు పూర్తయితే వాహనాల రాకపోకలను యథావిధిగా అనుమతించనున్నారు.


