కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జూనియర్ డాక్టర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో మూడు రోజులుగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెకు శనివారం ఆయన సంఘీభావం ప్రకటించారు. సమ్మె శిబిరం వద్దకు వెళ్లి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ వైద్యులకు ప్రతి రెండేళ్లకు స్టైఫండ్ పెంచాలని, ఈ ఏడాది 30 శాతం పెంచాల్సి ఉన్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. జూనియర్ వైద్యులు పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదన్నారు. అలాగే వైద్యుల ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు కొనసాగించాలన్నారు. జూనియర్ వైద్యులు సమ్మెలో ఉన్నా, అత్యవసర సేవలకు ఎటువంటి ఆటంకం లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారని, దీనిని తాను అభినందిస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో వారితో కలిసి పోరాటం చేస్తామన్నారు.
● వేలాది మంది రోగులకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న జూనియర్ డాక్టర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్ కుమార్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్ల శ్రమకు తగిన విధంగా స్టైఫండ్ను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.


