ఫ బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు
ఫ నేడూ తప్పని ఇబ్బందులు
రాజమహేంద్రవరం సిటీ: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా నుంచి 123 బస్సులను తరలించడంతో శుక్రవారం సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని రాజమహేంద్రవరం, గోకవరం, కొవ్వూరు, నిడదవోలు డిపోల పరిధిలో 276 బస్సులు 67 రూట్లలో నడుస్తున్నాయి. వీటిలో నిత్యం సుమారు 25 వేల మంది సామాన్య ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లాలో రెండు రోజుల పాటు 123 బస్సులను రద్దు చేశారు. వీటిని వివిధ ప్రాంతాల నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలను తరలించేందుకు కేటాయించారు. దీంతో జిల్లాలోని నాలుగు ఆర్టీసీ డిపోల పరిధిలో బస్సుల రాక కోసం ప్రయాణికులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. షెడ్యూల్ బస్సులు లేకపోవడంతో పాటు ఆలస్యం రావడంతో వాటిలో ఎక్కేందుకు ప్రయాణికులు తోపులాటకు దిగారు.


