అమలాపురం రూరల్: భారతీయ వాయుసేన నిర్వహిస్తున్న అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీని సద్వినియోగం చేసుకోవాలని కోనసీమ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి.హరిశేషు అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థుల కోసం ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీని గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ నెల 9న ఏపీ, తెలంగాణ మహిళా అభ్యర్థులకు, 12న ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులకు, 15న తెలంగాణ పురుష అభ్యర్థులకు జరుగుతాయన్నారు. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు 2005 ఫిబ్రవరి 5 నుంచి 2009 జనవరి మధ్యలో జన్మించి ఉండాలని, ఎత్తు కనీసం 152 సెంటీమీటర్లు, ఏదైనా స్ట్రీమ్లో ఇంటర్, తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత తేదా మూడేళ్ల డిప్లొమా ఇంజినీరింగ్ లేక, రెండేళ్ల ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలన్నారు. తెలంగాణ పురుష అభ్యర్థులకు ర్యాలీకి ముందస్తు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదని, సర్టిఫికెట్ కాపీలతో నేరుగా హాజరు కావొచ్చన్నారు. అభ్యర్థులు https://agnipathvayu.cdac.in వెబ్సైట్లో చూడాలని, లేకుంటే జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖను సంప్రదించాలని తెలిపారు.
కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం
ఏలేశ్వరం: ఏలేరు ప్రాజెక్టు నుంచి విశాఖపట్నానికి నీరందిస్తున్న ఎడవ కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం శనివారం లభ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏలేశ్వరం క్వారీ ప్రాంతానికి చెందిన బంగర్తి విజయ్, గిడుతూరి లోవరాజులు శుక్రవారం ఉదయం అడ్డతీగల మండలం గొంటువానిపాలెం క్వారీ పనులకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా సిరాయవరం వచ్చేసరికి బైక్ అదుపుతప్పి ఏలేరు ఎడమ కాలువలో పడిపోయారు. స్థానికులు కాలువలో దిగి వెతకగా విజయ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. లోవరాజు గల్లంతు కాగా, శనివారం ప్రమాద సమీపంలోనే మృతదేహం లభ్యమైంది. లోవరాజుకు భార్య నాగమణితోపాటు కుమారైలు నవ్య, లోవకుమారి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు ఇసుక లారీల సీజ్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అధిక లోడుతో ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీలను అధికారులు శనివారం సీజ్ చేశారు. రూ.1.70 లక్షల జరిమానా విధించారు. జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ కథనం ప్రకారం.. రాజానగరం హైవే పరిధి, లాలాచెరువు సమీపంలో పరిమితికి మించి ఇసుక లోడ్తో వెళ్తున్న రెండు లారీలను రవాణా అధికారులు పట్టుకున్నారు. సీజ్ చేసిన వాహనాలను అపరాధ రుసుము చెల్లించిన తర్వాత విడుదల చేశామన్నారు. పరిమితికి మించి ఇసుక రవాణా చేయడం వల్ల రహదారులపై ఇసుక పడి ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని, ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో జరిగాయన్నారు. ఇసుక రవాణా చేసే వాహన యజమానులు, డ్రైవర్లు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు.


