దేవరపల్లి: పొగాకు క్యూరింగ్, గ్రేడింగ్ ముమ్మరంగా జరుగుతున్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గోపాలపురం పొగాకు వేలం కేంద్రం నిర్వహణాధికారి బి.శ్రీహరి సూచించారు. పొగాకు సాగులో సస్యరక్షణ, పురుగు మందుల అవశేషాల నియంత్రణ, అన్య పదార్థాల నిర్మూలన, తలలు తుంచడం, పిలకల నివారణపై బుధవారం గోపాలపురంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ పొగాకు రంగులు, నాణ్యత ఆశాజనకంగా ఉందని, బోర్డు నిబంధనలకు లోబడి పంట సాగు చేయాలన్నారు. 150 కిలోలకు మించి బేలు తయారు చేయవద్దని, మండెలను ఎప్పటికప్పుడు పరిశీలించి, మార్పిడి చేసుకోవాలన్నారు. అనంతరం గ్రామంలోని పలువురు రైతుల పొగాకు తోటలు, బ్యారన్ల వద్ద క్యూరింగ్ చేసిన పొగాకును బోర్డు అధికారులు, పలు కొనుగోలు సంస్థల ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు పరిశీలించారు. సమావేశంలో ఐటీసీ లీఫ్ డెవలప్మెంట్ మేనేజర్ బసవరాజు పాటిల్, జీపీఎస్ కంపెనీ ప్రతినిధి రవి, పోలిశెట్టి కంపెనీ ప్రతినిధి శ్రీను, రైతు సంఘం ప్రతినిధులు కూసం రామ్మోహన్రెడ్డి, ముల్లంగి శ్యామ్సుందర్ రెడ్డి, ముల్లంగి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
హత్య కేసులో
నిందితుల అరెస్టు
సీతానగరం: బొబ్బిల్లంక గ్రామంలోని సుబ్బారావు పేటలో సోమవారం అర్ధరాత్రి జరిగిన మాజీ భార్య, అత్త హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పర్చుతున్నట్లు కోరుకొండ సీఐ ఎస్వీవీఎస్ మూర్తి తెలిపారు. ఆయన బుధవారం సీతానగరం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. హత్యకు పాల్పడిన చోడదాసి సీతారామరాజు (పండు), అతడికి సహకరించిన స్నేహితులు, అదే గ్రామానికి చెందిన చోడదాసి రమేష్ (చిన్న), చిత్రపు అజయ్ కుమార్, కన్నెం సురేష్ (పెద్ద)లను అరెస్ట్ చేశామన్నారు. ఎస్సై డి.రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


