రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
నిడదవోలు: రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామానికి చెందిన పెదపాటి సాయికిరణ్ (20) తాడేపల్లిగూడెంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. రోజూ కళాశాల బస్సులో వెళ్లే సాయికిరణ్ శుక్రవారం నిర్వహించిన కళాశాల ఫెస్ట్కు ఇంటి నుంచి స్నేహితులతో కలసి బైక్పై వెళ్లాడు. అది పూర్తయిన తర్వాత ఇంటికి తిరిగి బైక్పై బయలుదేరాడు. ఈ క్రమంలో నిడదవోలు బసివిరెడ్డిపేటలో ఆర్ఓబీ నిర్మాణంలో భాగంగా భారీ వాహనాలు రాకుండా అధికారులు రోడ్డుకు అడ్డంగా మట్టి దిబ్బలను ఏర్పాటు చేసి, వాహనాల రాకపోకలను నిలువరిస్తున్నారు. అయితే ద్విచక్ర వాహనాలు మాత్రం రాకపోకలు సాగిస్తున్నాయి. భారీ వాహనాలు రాకుండా బట్టి దిబ్బలు వేయడం, రాత్రి సమయంలో చీకటిగా ఉండటంతో విద్యార్థి సాయికిరణ్ మట్టి దిబ్బలను దాటించే క్రమంలో అదుపుతప్పి బైక్పై నుంచి కిందపడి అక్కడికక్కడే మరణించాడు. మార్కొండపాడు గ్రామానికి చెందిన పెదపాటి శ్రీనివాస్, ఇంద్ర దంపతులకు ఇద్దరు కుమారులలో పెద్ద కుమారుడు సాయికిరణ్. కాగా రెండో కుమారుడు బాలు ఇంటర్ వరకు చదివి తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. పెదపాటి శ్రీనివాస్ చేపల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ పెద్ద కుమారుడు సాయికిరణ్ను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. విషయం తెలుసుకున్న సాయికిరణ్ సోదరుడు బాలు, స్నేహితులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. అన్నా లేరా.. అమ్మ తిడుతుందిరా.. వెళ్లిపోదాం అంటూ విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పట్టణ ఎస్సై జగన్మోహన్రావు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం


