
భక్తవత్సలా.. గోవిందా..
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం శనివారం వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో మురిసిపోయింది. ఎక్కడ చూసినా కిక్కిరిసిన జనంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. గోవింద నామస్మరణతో క్షేత్రం మార్మోగింది. ప్రధానార్చకుడు ఖండవిల్లి ఆధిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యాన అర్చకులు, వేద పండితులు స్వామివారికి సుప్రభాత సేవ తదితర సేవలు నిర్వహించారు. స్వామివారిని సుగంధభరిత పుష్పాలతో విశేషంగా అలంకరించారు. శ్రీ వేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఏడు శనివారాల నోములో భాగంగా మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేశాక, కోరిన కోర్కెలు తీరిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన తరలి వచ్చి, మొక్కులు చెల్లించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు రావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల సౌకర్యార్థం అదనపు ఏర్పాట్లలో భాగంగా మరో ఫ్లై ఓవర్ నిర్మించారు. వేంకటేశ్వరస్వామి దర్శించుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో వేంచేసియున్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అన్నప్రసాదం స్వీకరించారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యక్రధరరావు భక్తుల ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు. స్వయంగా క్యూలైన్లో కలిసిపోయి, వారి మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారితో పాటే స్వామి వారిని దర్శించుకున్నారు. సాయంత్రం 5 గంటల సమయానికి దేవస్థానానికి స్వామి వారి ప్రత్యేక దర్శనం, అన్నప్రసాద విరాళాలు, వివిధ సేవలు, లడ్డూ ప్రసాదం విక్రయం, ఆన్లైన్ ద్వారా రూ.49,60,411 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు.
● వాడపల్లికి భక్తజన శోభ
● స్వామివారిని వేలాదిగా దర్శించుకున్న భక్తులు
● రూ.49.60 లక్షల ఆదాయం