అమలాపురం టౌన్: జిల్లాలో ఉన్న సముద్ర జలాలు చమురు సంస్థల డ్రిల్లింగ్ ఆపరేషన్ల వల్ల కలుషితం అవుతున్నాయని, ఫలితంగా లక్షలాది మంది మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటోందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్కు సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోనసీమ మత్స్యకారులకు 14 మీటర్లతో ఉండే సోనా బోట్స్ మాత్రమే అందుబాటులో ఉంటున్నాయని, సముద్ర లోతు జలాల్లో ఉండే టూనా చేపలను వేటాడాలంటే 22 మీటర్లతో హైడ్రాలిక్ లిఫ్ట్ కలిగినవి ఉండాలని చెప్పారు. 100 శాతం సబ్సిడీతో వాటిని చమురు సంస్థలు సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల కింద అందించాలని డిమాండ్ చేశారు. విదేశాల్లో మత్స్యకారుల సేవలకు గాను అమలులో ఉన్న డీహెచ్ఎఫ్ హై ఫ్రీకెన్సీ వాట్యాప్, హ్యామ్ రేడియోలను మన రాష్ట్రంలోనూ పునరుద్ధరించాలని కోరారు.
ముగిసిన పవిత్రోత్సవాలు
ఆత్రేయపురం : కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాలు మూడో రోజు మహా పూర్ణాహుతితో అత్యంత వైభవంగా ముగించారు. టీటీడీ వేద పండితుడు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆచార్యులు పర్యవేక్షణలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు, హోమాలు, సేవలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు దంపతులు, కమిటీ సభ్యులు, సిబ్బంది, అర్చకులు, వేద పండితులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్
చట్టం అమలుచేయాలి
అమలాపురం రూరల్: దళితులు, ఆదివాసులు, క్రైస్తవులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని కోరుతూ దళిత హక్కుల పోరాట సమితి (డీహీచ్పీఎస్) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వారికే వినియోగించాలని, ఎస్సీ పేటల్లో సీసీ రోడ్లు నిర్మించాలని, రాజోలు ఎస్సీ హాస్టల్ను వెంటనే నిర్మించాలని కోరారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం నెహ్రూ కాలనీలో కమ్యూనిటీ భవనం నిర్మించాలని, పేరుకుపోయిన ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులను సత్వరమే విచారించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డీఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు. డీహీచ్పీఎస్ జిల్లా గౌరవాధ్యక్షుడు దేవ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గండి రవికుమార్, జిల్లా నాయకులు కె.రామకృష్ణ,దేవ, సురేష్ బాబు, శీలం వెంకటేష్, పుల్లెల ఆనంద్, వై వెంకట్, నల్లి మోహన్, వనచర్ల విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఐక్య పోరాటాలతోనే
సమస్యల పరిష్కారం
అమలాపురం రూరల్: దళితుల సమస్యల పరిష్కారం కోసం కులమతాలకు అతీతంగా అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా పోరాడాలని మాజీ ఎమ్మెల్సీ యిళ్ల వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, వివిధ దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక శంఖారావంలో భాగంగా సోమవారం చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన అధ్యయన యాత్రల్లో వెలుగు చూసిన దళితుల సామాజిక, ఆర్థిక, మౌలిక వసతుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నిరసన చేపట్టారు. దళిత గ్రామాలు నేటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని, అనేక చోట్ల శ్మశాన వాటికలు ఆక్రమణకు గురికావడం పట్ల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ధర్నానుద్దేశించి మాజీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఎస్సీ ఏస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేతలు దడాల సుబ్బారావు, జంగా బాబురావు, జి.సురేష్ బాబు, అడ్వకేట్ వి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.


