రావులపాలెం: ఇటీవల గోదావరిలో చోటుచేసుకున్న విషాద ఘటనలో బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించడంలో భాగంగా రాజకీయ లబ్ధి కోసం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీపై బురద చల్లేలా వ్యాఖ్యలు చేయడం తగదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి హితవు పలికారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల రాజమహేంద్రవరం రోడ్ కం రైల్ బ్రిడ్జి వద్ద గోదావరి నదిలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి భాస్కరరెడ్డి కుటుంబ సభ్యులను ఈ నెల 19వ తేదీనే తాము రాజమహేంద్రవరంలోనే పరామర్శించి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పామన్నారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ తరపుర అండగా ఉంటామని భరోసా ఇవ్వడంతో పాటు అఽధికారులతో మాట్లాడామన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన వ్యక్తులు తమ స్వలాభం కోసం, రాజకీయ లబ్ధి కోసం మాట్లాడటం బాధాకరమన్నారు. జగదీశ్వరరెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే తాను వెళ్ళి పరామర్శించడంతో పాటు ధైర్యం చెప్పినట్టు గుర్తు చేశారు. ఈ ఘటనలో బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ ముందునుంచీ అండగా నిలిచిందన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే
విజయసాయిరెడ్డి ఆరోపణలు
కొత్తపేట నియోజకవర్గంలో గతంలో వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 28 దేవాలయాల ఆధునికీకరణ పనులకు, కొత్త దేవాలయాలు నిర్మించడానికి అనుమతులు తెచ్చామని, వాటిలో 18 దేవాలయాల పనులు తమ హయాంలోనే పూర్తయ్యాయని జగ్గిరెడ్డి గుర్తు చేశారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ జగన్మోహన్రెడ్డి చర్చిలకు నిధులిచ్చారని మాట్లాడటాన్ని ఇక్కడి ప్రజలు నమ్మరన్నారు. ఇటువంటి ఘటనల్లో రాజకీయాలు చేయడం కాదని, బాధిత కుటుంబానికి అండగా నిలిచి న్యాయం కోసం పోరాడాలి కానీ చౌకబారు మాటలు మాట్లాడటం తగదని హితవు పలికారు.
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై జగ్గిరెడ్డి విమర్శ


