కలెక్టరేట్ వద్ద
రైల్వే లైన్ భూముల రైతుల ధర్నా
అమలాపురం రూరల్: కోటిపల్లి – నరసాపురం రైల్వే లైను కోసం భూసేకరణ చేసి మూడేళ్లు అవుతోందని, ప్రభుత్వం నేటికీ పరిహారం అందించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వెంటనే ప్రభుత్వం నష్టపరిహారాన్ని మంజూరు చేయాలని కోరుతూ వారు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అమలాపురం మండలం కామనగరువు, చిందాడగరువు, భట్నవెల్లి, రోళ్లపాలెం గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ చేపట్టారని, రైతులకు చెందిన భూముల్లో సర్వే చేసి కర్రలు పాతారని, ఆ భూములకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజులపూడి మురళీకృష్ణ అధ్వర్యంలో రైతులు ఉర్రింగి రమేష్, కామన తిరుమల నరేంద్ర కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన పీజీఆర్ఎస్లో డీఆర్ఓ సుబ్బారావుకు వినితిపత్రం అందించారు. నాలుగు గ్రామాల్లో తమ భూములను అమ్ముకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తోందని ఈ సందర్భంగా వారు అవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలకు చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్లకు రుణాలు చేయాలన్నా, కొంత భూమి విక్రయించాలన్నా వీలుకాని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. కలెక్టర్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తమ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరారు.


