రాష్ట్ర బడ్జెట్లో నిరుద్యోగులకు మరలా మొండిచేయి చూపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లవుతోంది. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అంటూ ప్రచారం జోరుగా చేస్తున్నారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించిన వారిపై రెడ్ బుక్ను ప్రయోగించి, భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు. తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణం నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతిగా రూ.3 వేలు ఇస్తామని, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా కనీసం ఉద్యోగాల మాట లేకపోవడం సిగ్గుచేటు.
– ఎస్.కిరణ్ కుమార్, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజమహేంద్రవరం
రైతులకు తీవ్ర నిరాశ
రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ రైతులను నిరాశపరిచింది. వరి, మామిడి, టమాటా, పొగాకు, ఉల్లి, సజ్జ, కూరగాయలు, ఉద్యాన పంటలకు కనీస మద్దతు ధర ఊసే లేదు. ఉచిత పంటల బీమాకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చారు. ఇరిగేషన్ శాఖకు నిధుల కేటాయింపులు శూన్యం. డెల్టా, డ్రెయిన్ల ఆధునీకరణను, మహిళలు, యువత, నిరుద్యోగులను విస్మరించారు. సంపద సృష్టిస్తామని మాయ మాటలు చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టి అన్ని వర్గాలనూ మోసం చేశారు. సూపర్ సిక్స్ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమయ్యారు.
– జున్నూరి రామారావు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా


