
ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్
అల్లవరం: కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలంలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుందని, అందుకే చంద్రబాబు, లోకేష్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏలూరు ‘సాక్షి’ కార్యాలయంలపై కూటమి నేతలు పెట్రోల్ బాటిల్తో దాడులు చేసి తగులబెట్టడం దారుణమన్నారు. ప్రభుత్వానికిపత్రికా స్వేచ్ఛపై చిత్తశుద్ధి ఉంటే దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల బనాయించి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ఏపీలో మహిళలకు రక్షణ కరవైందని, చిన్నారులపై లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా తప్పుడు రాజకీయాలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పాత్రికేయులకు పూర్తి స్వేచ్చ రాజ్యంగంలో కల్పించబడిందని, ఈ కూటమి ప్రభుత్వం హక్కులను కాలరాస్తుందన్నారు. ఇప్పటికైనా తప్పుడు విధానాలను మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయిస్తే కోర్టు, ఎస్పీ, డీఎస్పీలకు మోమోలు జారీ చేసిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతుందని కోర్టు వేసిన అక్షింతలు ద్వారా తెలుస్తుందన్నాని ఇజ్రాయిల్ అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం విధానం మార్పుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
జర్నలిస్ట్లపై అక్రమ కేసులు దారుణం
అమలాపురం టౌన్: రాష్ట్రంలో సీనియర్ జర్నలిస్ట్లు, వైఎస్సార్ సీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి వేధించడం దారుణమని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. ముఖ్యంగా సీనియర్ జర్నలిస్ట్లు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఎమ్మెల్సీ ఖండించారు. అమలాపురం హైస్కూలు సెంటరులోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు బుధవారం సాయంత్రం స్థానిక మీడియాతో మాట్లాడారు. ఈ అక్రమ కేసులను చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? కక్ష సాధింపు చర్యల్లో ఉన్నామా? అనే సందేహం కలుగుతోందన్నారు. డైవర్షన్ పాలిటిక్స్తో ప్రభుత్వం ‘సాక్షి’ కార్యాలయాల ఎదుట ధర్నాలు, కేసులు అనే కొత్త నాటకానికి తెర తీసిందని చెప్పారు. భారత రాజ్యాంగంలో నాలుగో స్తంభంగా ఉన్న జర్నలిజాన్ని నేటి కూటమి ప్రభుత్వం ఖతం చేసే ప్రయత్నంలో ఉందని అన్నారు. ప్రభుత్వం కూటమి పార్టీల నేతలకే రక్షణగా నిలుస్తోందని విమర్శించారు. తుపాకీ గొట్టంతో రాజ్య హింస ద్వారా నియంత పాలన రుచి చూపిస్తోందని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు ఆరోపించారు.
జిల్లాలో నాలుగు రోజులు విద్యుత్కు అంతరాయం
అమలాపురం రూరల్: జిల్లాలో గురువారం నుంచి 16 తేదీ వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఎస్ఈ రాజబాబు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దశలవారీగా కోతలు విధిస్తామని పేర్కొన్నారు. అమలాపురం, కొత్తపేట, రాజోలు, ముమ్మిడివరం పరిధిలో ఉన్న ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అమలాపురం మున్సిపాలిటీ, అమలాపురం రూరల్, అల్లవరం, అయినవల్లి, అంబాజీపేట, రాజోలు, మామిడికుదురు, పి.గన్నవరం, మలికిపురం, సఖినేటిపల్లి, కొత్తపేట, రావులపాలెం మండలాలకు, రామచంద్రపురం టౌన్–2, ద్రాక్షారామ, రాయవరం, కపిలేశ్వరపురం కె.గంగవరం మండలాల పరిధిలో స్వల్పంగా విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుందన్నారు.
సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం
అమలాపురం రూరల్: జిల్లాలో 1,534 ప్రభుత్వ పాఠశాలలు, 62 సంక్షేమ హాస్టళ్లలో గురువారం నుంచి మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం వినియోగిస్తామని జేసీ టీ.నిషాంతి ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే సన్న బియ్యాన్ని సరఫరా చేశామన్నారు.