వాడపల్లి వెంకన్నకు రూ.1.32 కోట్ల రాబడి | - | Sakshi
Sakshi News home page

వాడపల్లి వెంకన్నకు రూ.1.32 కోట్ల రాబడి

May 30 2025 3:11 PM | Updated on May 30 2025 3:24 PM

 Staff counting hundis income

హుండీల ఆదాయం లెక్కిస్తున్న సిబ్బంది

కొత్తపేట: కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ఆలయ హుండీల ద్వారా రూ1.32 కోట్ల ఆదాయం సమకూరింది. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఈ విషయం తెలిపారు. ఆలయంలోని హుండీలను 31 రోజుల అనంతరం గురువారం తెరచి, వసంత మండపంలో లెక్కించారు. 

ప్రధాన హుండీల ద్వారా రూ.1,11,60,745, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ.20,43,431 ఆదాయం వచ్చిందని ఈఓ వివరించారు. ఒక భక్తురాలి నిలువు దోపిడీ ద్వారా 104 గ్రాములు, మిగతా భక్తులు సమర్పించినది 8 గ్రాములు కలిపి మొత్తం 112 గ్రాముల బంగారం, 980 గ్రాముల వెండి, 64 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని తెలిపారు. గురువారం ఒక్క రోజే వివిధ సేవలు ద్వారా రూ.3,77,057 ఆదాయం వచ్చిందని చక్రధరరావు పేర్కొన్నారు.

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

ముమ్మిడివరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 31న ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాల్లో చేపట్టనున్న పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ గురువారం పరిశీలించారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, ప్రాంతీయ ఇంటెలిజెన్స్‌ అధికారి కృష్ణారావు, ఇతర జిల్లా అధికారులతో కలసి అడ్వాన్స్‌ సెక్యూరిటీ లైజన్‌ పర్యటన చేపట్టారు. సీహెచ్‌ గున్నేపల్లిలో సత్తెమ్మ గుడి ఎదురుగా ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ను, చెయ్యేరులో ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు రూ.9.88 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను, సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ వేదిక ఏర్పాట్లను, చెయ్యేరు జెడ్పీ హైస్కూల్‌ వెనుక ఏర్పాటు చేసిన ప్రజా వేదికను, సీహెచ్‌ గున్నేపల్లిలో సత్తెమ్మ తల్లి గుడి పక్కన పార్టీ శ్రేణుల సమావేశ స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, ఆర్‌డీఓలు డి.అఖిల, ఎ.మాధవి, డ్వామా పీడీ మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ఢిల్లీ నుంచి శనివారం మధ్యాహ్నం 12.25 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 12.50 గంటలకు సీహెచ్‌ గున్నేపల్లి చేరుకుని, చెరువు పూడికతీత పనులను పరిశీలిస్తారు. అనంతరం పీ–4 బంగారు కుటుంబాలను మార్గదర్శకులకు దత్తత ఇచ్చే కార్యక్రమం చేపట్టి, పింఛన్లు పంపిణీ చేస్తారు. గ్రామస్తులతో ముఖాముఖి, పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తారు.

డీలర్లు నిబంధనలు పాటించాలి

అమలాపురం రూరల్‌: నిబంధనలకు లోబడి డీలర్లు వినియోగదారులకు రేషన్‌ సరకులు సరఫరా చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్‌ ఆదేశించారు. వచ్చే నెల 1 నుంచి ప్రజాపంపిణీ విధానం ద్వారా నిత్యావసర వస్తువులను చౌక దుకాణాల ద్వారానే పంపిణీ చేస్తామన్నారు. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకూ, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకూ రేషన్‌ షాపులు తెరచి ఉంచాలని డీలర్లను ఆదేశించారు. దుకాణాల పని వేళలు, ధరలు, సరకుల నిల్వను సూచించే బోర్డు షాపు ముందు భాగంలో తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. 65 సంవత్సరాలు పైబడిన వారికి, దివ్యాంగులకు ఇళ్లవద్దనే రేషన్‌ పంపిణీ చేయాలన్నారు. ఈ–పోస్‌, వేయింగ్‌ మెషీన్లు కండిషన్‌లో ఉంచుకోవాలని, కార్డుదారులందరికీ కచ్చితమైన కొలతలు, తూకంతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి, రశీదు ఇవ్వాలని ఆదేశించారు. రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానం తీసుకుని వచ్చిందని డీఎస్‌ఓ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ మార్పులు చేసుకోవచ్చన్నారు. కొత్త బియ్యం కార్డు, కార్డు విభజన, సాధారణ విభజన, వితంతువు విభజన, విడాకుల విభజన, సింగిల్‌ మెంబర్‌ స్ల్పిట్‌, కొత్త సభ్యుల చేరిక, ఉన్నవారి తొలగింపు, తప్పు ఆధార్‌ సీడింగ్‌, చిరునామా మార్పు, కార్డు సరెండర్‌ వంటివి చేసుకోవచ్చని ఉదయ భాస్కర్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement