మృత్యువులోనూ వీడని బంధం | Wife And Husband Died In Road Accident At Karimnagar | Sakshi
Sakshi News home page

మృత్యువులోనూ వీడని బంధం

Mar 5 2021 9:29 AM | Updated on Mar 5 2021 9:32 AM

Wife And Husband Died In Road Accident At Karimnagar - Sakshi

చొప్పదండి: ఇంటి నుంచి బయలుదేరిన నిమిషం వ్యవధిలోనే ఆటోరూపంలో దంపతులను మృత్యువు కబళించిన సంఘటన చొప్పదండి మండలం రాగంపేట శివారులో గురువారం జరిగింది. సీఐ కదిర నాగేశ్వర్‌రావు కథనం ప్రకారం..రెవెళ్లి గ్రామానికి చెందిన వొడ్నాల సంపత్‌కు పక్కనే ఉన్న రాగంపేటకు చెందిన స్వప్నతో ఆరేళ్లక్రితం వివాహం జరిగింది. వీరికి అయిదేళ్ల కుమారుడు, మూడేళ్ల కూతురు ఉన్నారు. సంపత్‌ స్థానికంగా కూలి పని, వ్యవసాయ పనులు చేసుకుంటుండగా స్వప్న నగునూరులోని ఆసుపత్రిలో స్వీపర్‌గా పనిచేస్తోంది. గురువారం స్వప్నను ఆసుపత్రికి పంపించేందుకు బైక్‌పై (టీఎస్‌ 02 ఈఎక్స్‌ 5625) ఇంటి నుంచి బయలుదేరారు.

రెవెళ్లి శివారు దాటి రాగంపేట శివారులోని పెద్దమ్మ గుడి వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న ఆటో (ఏపీ 15 టీఏ 9012)ను అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చిన డ్రైవర్‌ బైక్‌ని బలంగా ఢీకొట్టాడు. బండిపై నుంచి ఎగిరిపడ్డ స్వప్న అక్కడికక్కడే, సంపత్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. సంపత్‌ తల్లి వొడ్నాల లచ్చమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement