ఆటోను ఢీకొన్న మోటార్‌ బైక్‌.. ఇద్దరు విద్యార్థులు మృత్యువాత | Tragedy in Chittoor district | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న మోటార్‌ బైక్‌.. ఇద్దరు విద్యార్థులు మృత్యువాత

Dec 21 2024 4:59 AM | Updated on Dec 21 2024 4:59 AM

Tragedy in Chittoor district

చిత్తూరు జిల్లాలో విషాదం

తవణంపల్లె: చిత్తూరు, కాణిపాకం రోడ్డు సత్తారు బావి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృత్యువాత పడ్డారు.  తవణంపల్లె ఎస్‌ఐ చిరంజీవి కథనం మేరకు.. మండలంలోని ముత్తరపల్లె గ్రామానికి చెందిన గోవిందు కుమారుడు సాయితేజ (19), మైనగుండ్లపల్లెకు చెందిన ప్రసాద్‌రెడ్డి కుమారుడు హర్ష (19) ఇద్దరు స్నేహితులు. 

వీరిద్దరూ చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు.  శుక్రవారం సాయితేజ తన మోటార్‌ సైకిల్‌లో తన స్నేహితుడు హర్షను వెనుక కూర్చోబెట్టుకుని పరీక్ష రాయడానికి కాలేజ్‌కు బయలుదేరారు. ఈ తరుణంలో సత్తారు బావి సమీపంలో ముందు వెళ్తున్న బస్సును అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను వేగంగా ఢీకొన్నారు. 

ప్రమాదంలో సాయితేజ, హర్షకు బలమైన గాయాలు కావడంతో తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. దీంతో క్షతగాత్రులను 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం చిత్తూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు నిర్థారించారు. తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.   

Advertisement
 
Advertisement
Advertisement