‘బాధ్యత తెలియదని అలా మాట్లాడాను.. ఇలా చేస్తారని ఊహించలేదు’

Three Members Of Same Family Committed Suicide In Tamil Nadu - Sakshi

తిరువళ్లూరు(తమిళనాడు): పనికి వెళ్లడం లేదని బంధువుల ముందు మామ మందలించడం.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో అవమాన భారంగా భావించిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. కాంచీపురం జిల్లా వాలాజాబాద్‌ సమీపంలోని అయ్యంపేటకు చెందిన కలైఅరసన్‌ (37) క్యాటరింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఇతనికి తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌ తిరుమేణి పంచాయతీ వసినంపట్టు గ్రామానికి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి కుమార్తె నిత్య(30)తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు హేమనాథ్‌ (06) ఉన్నాడు. క్యాటరింగ్‌ పనుల ద్వారా  కలైఅరసన్‌కు సరైన ఆదాయం రాకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో భార్య కుమారుడితో కలిసి మూడు నెలల క్రితం అత్తారింటికి వచ్చాడు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్నాడు.

రెండు రోజుల క్రితం నిత్య తండ్రి లోకనాథన్‌ తన బంధువుల ముందు అల్లుడిని పనులకు వెళ్లాలని మందలించాడు. అప్పటి నుంచి కలైఅరసన్‌ మనస్తాపంతో ఉన్నాడు. దీనికి తోడు అప్పులు చెల్లించాలని ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.  పురుగుల మందును మొదట కుమారుడికి ఇచ్చారు. అనంతరం నిత్య, కలైఅరసన్‌ సైతం పురుగుల మందును తాగి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించి మప్పేడు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ శక్తివేల్‌ మృతదేహాలను తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఖాళీగా ఉంటే బాధ్యత తెలియదని అలా మాట్లాడానని.. ఇంత పనిచేస్తారని ఊహించలేదని మామ, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
చదవండి: ‘నా లక్ష్మిని లోకంలో లేకుండా చేశాను’.. వీడియో రికార్డు చేసి.. చివరికి బిగ్‌ ట్విస్ట్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top