‘నా లక్ష్మిని లోకంలో లేకుండా చేశాను’.. వీడియో రికార్డు చేసి.. చివరికి బిగ్‌ ట్విస్ట్‌

Man Who Assassinated Woman In Karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు(కర్ణాటక): మహిళను రాయితో బాది హత్య చేసిన వ్యక్తి ఆ దృశ్యాలను వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చామరాజనగర జిల్లా మలెమహదేశ్వరబెట్ట పరిధిలోని నాగమలెలో జరిగింది. తమిళనాడు పెన్నాగరం చెక్‌పోస్టు ప్రాంతంలో నివాసం ఉంటున్న లక్ష్మి (35) తన భర్తతో విభేదించి నాగమలెకు చేరుకుంది. తమిళనాడు ధర్మపురి జిల్లా వీరభద్రయ్యనహళ్లికి చెందిన మునిరాజు (40)తో సంబంధం పెట్టుకుంది.

ఏడు నెలల క్రితం నాగమలెకు చెందిన రమేశ్‌ అనే వ్యక్తిని లక్ష్మి రెండో వివాహం చేసుకుంది. మంగళవారం లక్ష్మిని వెతుక్కుంటూ వచ్చిన మునిరాజు.. కోపంతో లక్ష్మి తలపై రాయితో బాది హత్య చేశాడు. అంతకుముందు కొన ఊపిరితో ఉన్న సమయంలో  ఆమె వద్ద కూర్చొని వీడియో రికార్డు చేసి ఫేస్‌బుక్‌లో పెట్టాడు.

‘నా లక్ష్మిని నేను ఈ లోకంలో లేకుండా చేశాను.. నన్ను హంతకుడిగా మార్చింది’ అంటూ మునిరాజు వీడియోలో వ్యాఖ్యలు చేశాడు. అనంతరం  బొమ్మ అనే వ్యక్తి పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని మునిరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మి భర్త రమేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మలెమహదేశ్వరబెట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి: ఐపీఎస్‌ రూపా Vs ఐఏఎస్‌ రోహిణి: కాల్‌ లీక్‌ ప్రకంపనలు.. ఆ ఆడియోలో ఏముంది? 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top