ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్లో చోరీ | Theft at SBI ATM center | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్లో చోరీ

Jun 9 2024 5:09 AM | Updated on Jun 9 2024 5:09 AM

Theft at SBI ATM center

రూ.18,41,300 నగదు అపహరణ 

కూడేరు: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఏటీఎం సెంటర్‌లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటన అనంతపురం జిల్లా, కూడేరు మండలంలో చోటుచేసుకుంది. ఏటీఎంను పగులగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు, అందులోని రూ.18,41,300 నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కూడేరులో దళితవాడకు ఎదురుగా అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కన అనంతపురం సాయినగర్‌లోని  స్టేట్‌ బ్యాంకు ప్రధాన శాఖ ఏటీఎం సెంటర్‌ ఏర్పాటు చేశారు. 

శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కట్టర్‌తో ఏటీఎంను కట్‌ చేశారు. మిషన్‌లో ఉంచిన నగదు చోరీ చేశారు. అదే సమయంలో మిషన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించి పైభాగం కాలిపోయింది.  శబ్దం కూడా రావడంతో స్థానికుడొకరు బయటకు వచ్చి చూడగా.. ఏటీఎం సెంటర్‌ నుంచి కొందరు కార్లో వెళ్లిపోవడం,  సెంటర్‌లో నుంచి పొగ రావడం గమనించాడు. 

కొంత సమయం తర్వాత విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. సీఐ శివరాముడు ఏటీఎం సెంటరును పరిశీలించారు. చోరీ జరిగిందని నిర్ధారించుకుని సమాచారాన్ని బ్యాంకు అధికారులకు అందించారు. సంబంధిత అధికారులు వచ్చి పరిశీలించారు. నగదు నిల్వ, విత్‌డ్రాలకు సంబంధించి ప్రధాన కార్యాలయం నుంచి డేటా తీసుకున్నారు. రూ.18,41,300 చోరీకి గురైనట్టు పోలీసులకు తెలిపారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement