విమానం ఎక్కాక ఫోన్‌.. తర్వాత చేస్తే స్విచ్‌ ఆఫ్‌.. జాడ లేని ఆర్మీ జవాన్‌

Telangana: Army Jawan From Siddipet District Are Missing - Sakshi

ఆందోళనలో కుటుంబ సభ్యులు   

చేర్యాల(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా చేర్యాల మండలానికి చెందిన ఓ ఆర్మీ జవాన్‌ ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోతిరెడ్డిపల్లికి చెందిన బోకూరి సాయికిరణ్‌రెడ్డి పంజాబ్‌లో ఆర్మీ జవాన్‌ (గన్నర్‌)గా విధులు నిర్వహిస్తున్నాడు. మూడు వారాల క్రితం సెలవుపై వచ్చిన ఆయన తిరిగి విధుల్లో చేరేందుకు ఈ నెల 5న ఇంటి నుంచి బయలుదేరాడు. కాగా, శంషాబాద్‌ విమానాశ్రయంలో ఢిల్లీ విమానం ఎక్కిన తర్వాత అతను కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడాడు.

అనంతరం అతని గురించి ఎలాంటి సమాచారం లేదు. ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. వారం రోజులుగా వారు సాయికిరణ్‌ ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయమై పంజాబ్‌లోని ఆర్మీ అధికారులకు ఫోన్‌ చేయగా అతను విధుల్లో చేరలేదని చెప్పినట్లు కిరణ్‌ తల్లిదండ్రులు తెలిపారు. తమ బిడ్డ ఆచూకీ తెలుసుకోవడం కోసం సహకరించాలని వారు పలువురు ప్రజాప్రతినిధులను కలిశారు.

సాయికిరణ్‌ కనిపించకుండా పోవడంపై గ్రామానికి చెందిన ఓయూ విద్యార్థి, మంత్రి కేటీఆర్‌కి ట్విట్టర్లో సమాచారం ఇచ్చాడు. దీంతో పాటు సాయికిరణ్‌ తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్సై నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ సాయికిరణ్‌ కనిపించకుండా పోయిన సంఘటన ఇక్కడ జరగలేదు కాబట్టి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఢిల్లీ విమానాశ్రయ పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. అక్కడే కేసు నమోదైనట్లు వివరించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top