కాళ్ల పారాణి ఆరకముందే.. వరుడు దుర్మరణం, వధువుకు తీవ్ర గాయాలు.. ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే..

Software engineer died in road accident in Yadadri District - Sakshi

సాక్షి, యాదాద్రి: కాళ్ల పారాణి ఆరకముందే వరుడు దుర్మరణం చెందగా వధువుకు తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటన  వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూర్‌ (ఎస్‌) గ్రామానికి చెందిన ముల్కలపెల్లి వీరభద్రం (26)కు పెన్‌పహాడ్‌ మండలం అనాజీపురం గ్రామానికి చెందిన పేర్ల ప్రణీతతో ఈనెల 21న వివాహం జరిగింది. ఈ  దంపతులు హైదరాబాద్‌లోని ప్రైవేటు కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.

వివాహం అనంతరం విధుల్లో చేరేందుకు సోమవారం బైక్‌పై హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో చౌటుప్పల్‌ మండలం పంతంగి గ్రామ శివారులో రోడ్డు పక్కన ఉన్న బోర్డును ఢీ కొట్టి బైకు అదుపు తప్పడంతో కిందపడ్డారు. ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో, చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీరభద్రం మృతి చెందాడు. ప్రణీత చికిత్స పొందుతోంది. వీరభద్రం ఒక్కగానొక్క కొడుకు కావడం, పెళ్‌లైన 9రోజుల్లోనే మృతిచెందడంతో, ఆ తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఆసుపత్రిలో వీరభద్రం చికిత్స పొందుతూ మృతి చెందినట్టు సమాచారం అందిందని ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

చదవండి: (పక్కింటి మహిళతో వివాహేతర సంబంధం.. భార్యకు తెలిసి..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top