సిస్టర్‌ అభయ కేసు: దోషులకు జీవిత ఖైదు | Sister Abhaya Case Convicts Were Sentenced With life Imprisonment | Sakshi
Sakshi News home page

సిస్టర్‌ అభయ కేసు: దోషులకు జీవిత ఖైదు

Dec 23 2020 12:47 PM | Updated on Dec 24 2020 7:10 AM

Sister Abhaya Case Convicts Were Sentenced With life Imprisonment - Sakshi

తిరువనంతపురం: కేరళలోనే కాక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిస్టర్‌ అభయ కేసులో సీబీఐ కోర్టు ఫాదర్‌ థామస్ కొట్టూర్, నన్‌ సెఫీని దోషులుగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం సీబీఐ కోర్టు వీరికి శిక్ష ఖరారు చేసింది. ఫాదర్‌ థామస్‌ కొట్టూర్‌, నన్‌ సెఫీకి సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. దాంతో పాటు చెరో ఐదు లక్షల రూపాలయ జరిమానా కూడా విధించింది. దాదాపు 28 ఏళ్ల పాటు కొనసాగిన ఈ కేసులో చివరికి నేడు కోర్టు దోషులకు శిక్ష విధించింది. 1993లో కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఘటన జరిగిన 12 ఏళ్ల తర్వాత సెయింట్ పియస్ కాన్వెంట్‌లో అధ్యాపకులుగా పనిచేస్తున్న థామస్ కొత్తూర్, జోస్ పుత్రుక్కయిల్‌తో పాటు ఓ సిస్టర్‌ను అరెస్ట్‌ చేసింది. ఇక నేడు సీబీఐ కోర్టు వారికి శిక్ష విధించింది. ఇక కుమార్తెకు న్యాయం జరగాలని పోరాడిన అభయ తలిదండ్రులు నాలుగేళ్ల క్రితమే మరణించారు. కోర్టు తీర్పుతో వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని స్నేహితులు భావిస్తున్నారు. (చదవండి: ‘ఉరి తీసినా ఆశీర్వాదంగానే భావిస్తాను)

ఇక సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. మార్చి 27,1992న తెల్లవారుజామున 4.15గంటలకు సిస్టర్ అభయ తన హాస్టల్ గది నుంచి కిచెన్ వైపు వెళ్లింది. అక్కడ దోషులు థామస్ కొత్తూర్, జోస్ పుత్రుక్కయిల్‌ ఓ క్రైస్తవ సన్యాసినితో అభ్యంతరకర రీతిలో కనిపించారు. ఈ విషయం అభయ బయటపెడుతుందోమోనన్న భయంతో ఆమెపై దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. అనంతరం మృతదేహాన్ని కాన్వెంట్ ప్రాంగణంలోని బావిలో పడేశారు. ప్రమాదవశాత్తు అభయ బావిలో పడి మరణించి ఉండవచ్చునని పోలీసులు తొలుత నిర్ధారించారు. కానీ మానవ హక్కుల కార్యకర్త జోమోన్ పుతెన్‌పురక్కల్ ఈ కేసును కోర్టులో సవాల్ చేయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement