హేమంత్‌ది పరువు హత్యే : పోలీసులు | Sakshi
Sakshi News home page

హేమంత్‌ది పరువు హత్య: గచ్చిబౌలి పోలీసులు

Published Mon, Sep 28 2020 1:22 PM

Police Says Hemanth Assassination Is Honour Killing In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హేమంత్‌ కుమార్‌ హత్య కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి పరువు హత్యగా తేల్చారు. హేమంత్‌ను పక్కా ప్రణాళికతో పరువు కోసమే హత్య చేశారుని గచ్చిబౌలి పోలీసులు సోమవారం వెల్లడించారు. తమ కూతురు కులాంతర వివాహం చేసుకున్నందుకే లోకల్ గ్యాంగ్‌తో కలిసి హత్య చేయించినట్లు తండ్రి లక్ష్మారెడ్డి, మామ యుగంధర్ పోలీసులు ముందు నిజం ఒప్పుకున్నారు. అవంతి-హేమంత్‌ ప్రేమ వివాహం గురించి తెలిసిన లక్ష్మారెడ్డి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టించాడని పోలీసులు తెలిపారు. ఆరు నెలల పాటు అవంతిని బయటకు వెళ్లకుండా తండ్రి తీవ్రంగా కట్టడిచేశాడని వెల్లడించారు. దీంతో జూన్‌ 10న ఇంట్లో కరెంట్‌ పోయిన సమయంలో అవంతి ఇంట్లో నుంచి పారిపోయి హేమంత్‌ను కలిసిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు హేమంత్‌ హత్య కేసులో మొత్తం 22 మంది నిందితులు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (హేమంత్ హత్య కేసు: కీలకంగా మారిన ట్రావెల్స్ హిస్టరీ..)

నిందితులను ఐదు రోజుల పాటు కస్టడి కోరుతూ ఎల్బీనగర్‌ కోర్టులో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. సంఘటన స్థలానికి సంబంధించి జహీరాబాద్‌లో ఓఆర్‌ఆర్‌ మీద సీసీ కెమెరా దృశ్యాలను సేకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కస్డడిలోకి తీసుకొని సీన్‌ రీ-కన్‌స్ట్రక్చన్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు అవంతి, హేమంత్‌ కుటుంబసభ్యులు సీపీ సజ్జనార్‌ను కలవనున్నారు. రాష్ట్రంలో ఈ నెల 25న చోటు చేసుకున్న హేమంత్‌ హత్య రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. (హేమంత్‌ హత్య : అసలు తప్పెవరిది?)

Advertisement
Advertisement