దూసుకొచ్చిన మృత్యువు | one died in road accident at hyderabad | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన మృత్యువు

May 26 2024 6:54 AM | Updated on May 26 2024 6:59 AM

one died in road accident at hyderabad

మేడ్చల్‌ రూరల్‌: కారులో ప్రయాణిస్తున్న వారికి ప్రయాణం పడకపోవడంతో వాంతులు రాగా రోడ్డుకు ఎడమ వైపు కారు ఆపి..వాంతి చేసుకుంటుండగా డీసీఎం రూపంలో మృత్యువు దూసుకొచి్చంది. ఓ బాలుడి ప్రాణాలు బలిగొంది. ఈ సంఘటన మేడ్చల్‌ ఓఆర్‌ఆర్‌పై చోటు చేసుకుంది.

ఎస్‌ఐ లావణ్య తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని కూకట్‌పల్లికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి విద్యాసాగర్‌ శనివారం ఉదయం తన భార్య రమాదేవి, కుమారుడు రామ్, తల్లి రమమ్మ, వరంగల్‌కు చెందిన అక్క దీప్తి, అల్లుడు పూజిత్‌ రామ్‌(13), కోడలు వేదశ్రీలతో కలిసి బీబీనగర్‌ వెళ్లేందుకు శనివారం ఉదయం తమ కారులో బయలుదేరి ఓఆర్‌ఆర్‌ గుండా వెళ్తున్నారు. మార్గమధ్యలో మేడ్చల్‌ సమీపంలోకి చేరుకోగానే కారులో ఉన్న అల్లుడు పూజిత్‌రామ్, భార్య రమాదేవి, వేదశ్రీలకు వాంతులు కావడంతో కారును ఎడమవైపు ఆపారు. 

రమాదేవి, వేదశ్రీలు కారు దిగి పక్కకు వెళ్లగా..పూజిత్‌రామ్‌ తిరిగి కారు ఎక్కే సమయంలో అదే మార్గంలో వెనుకనుండి వేగంగా వచి్చన డీసీఎం వాహనం వీరి కారును ఢీకొట్టింది. దీంతో పూజిత్‌రామ్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించగా కారులో ఉన్న విద్యాసాగర్, కుమారుడు రామ్‌లకు గాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న మేడ్చల్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూజిత్‌రామ్‌ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement