ప్రేమించిన అమ్మాయి, స్నేహితులు మోసం చేశారని లాడ్జిలో.. | Sakshi
Sakshi News home page

ప్రేమించిన అమ్మాయి, స్నేహితులు మోసం చేశారని లాడ్జిలో..

Published Sun, Aug 22 2021 1:46 PM

Men Self Destruction At Lodge In Hyderabad - Sakshi

సాక్షి, హస్తినాపురం (హైదరాబాద్‌): ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ విఫలం కారణంగా వివాహమైన ఓ యువకుడు లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామానికి చెందిన షేక్‌ బ్రహ్మం(35) గతంలో లారీల వ్యాపారం చేస్తుండేవాడు. అతనికి భార్య ఖాశీంబీ, కూతురు, కుమారుడు ఉన్నారు.

శుక్రవారం తన స్వగ్రామం నుంచి నగరానికి వచ్చిన బ్రహ్మం వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆటోనగర్‌లోని వీఎంఆర్‌ గ్రాండ్‌ లాడ్జిలో నంబర్‌: 304 గదిలో అద్దెకు దిగాడు. ప్రకాశం జిల్లా రావిపోడుకు చెందిన బ్రహ్మం మిత్రుడు జ్యోతి వేణుగోపాల్‌ శనివారం నగరానికి చేరుకున్నాడు. మధ్యాహ్నం లాడ్జిలో ఇద్దరు కలిసి మద్యం సేవించారు. మద్యానికి, గదికి అద్దె డబ్బులు చెల్లించాలని బాయ్‌ వచ్చి అడిగాడు. తర్వాత చెల్లిస్తామని చెప్పి మిత్రుడితో కలిసి లాడ్జి కిందికి వచ్చాడు.

తర్వాత ఫోన్‌లో మాట్లాడుతూ గదిలోకి వెళ్లిన బ్రహ్మం తాను ఒక అమ్మాయిని ప్రేమించానని.. ఆమె, తన స్నేహితులు కూడా మోసం చేశారని చెబుతూ తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తన తల్లికి, భార్యకు రికార్డు చేసిన వీడియో పంపాడు. అనంతరం ఫ్యాన్‌కు లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోలు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

చదవండి: నా చావుకు భార్య, అత్తింటివారే కారణం..

Advertisement
Advertisement