సుజన, వెంకటకృష్ణ మధ్య మనస్పర్థలు.. అర్ధరాత్రి దాటాకా మూడో అంతస్తులో

Married Woman Commits Suicide in Dharmavaram Anantapur - Sakshi

సాక్షి, ధర్మవరం (అనంతపురం): అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ బ్యాంక్‌ ఉద్యోగి భార్య ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని నేసేపేటకు చెందిన వెంకటకృష్ణ.. తాడిమర్రిలోని ఎస్‌బీఐ శాఖలో పనిచేస్తున్నారు. 2016లో వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కొండయ్య, గంగాదేవి దంపతుల కుమార్తె వెంకట సుజన (26)ను పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి సమయంలో రూ.18 లక్షల కట్నం, 30 తులాల బంగారు నగలను సుజన తల్లిదండ్రులు అందజేశారు. కొన్నేళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంత కాలంగా సుజన, వెంకటకృష్ణ మధ్య మనస్పర్థలు చెలరేగి తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటిపైన మూడో అంతస్తులో సుజన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

చదవండి: (ఇంటర్‌ విద్యార్థినితో పరిచయం పెంచుకొని.. పలుమార్లు అత్యాచారం)

ఆదివారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, అదనపు కట్నం కోసమే వేధింపులకు గురిచేసి తమ కుమార్తెను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ వెంకటకృష్ణ కుటుంబసభ్యులతో మృతురాలి తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. ఈ మేరకు డీఎస్పీ రమాకాంత్‌కు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... మృతురాలి భర్తను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top