గదిలో మూత్రం పోశాడని తిట్టింది.. పగ పెంచుకుని

Man Trying To Assassinate Woman Over Humiliation - Sakshi

ముంబై : నలుగురి ముందు తనను తిట్టిందనే కారణంతో మహిళపై కక్ష కట్టాడో వ్యక్తి. ఆమెపై హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాగ్‌పూర్‌, కోరడి పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన కిష్న సోనెకర్‌ అక్కడి ఓ అపార్ట్‌మెంట్‌ భవనంలో నివాసం ఉంటున్నాడు. అదే అపార్ట్‌మెంట్‌ భవనంలోని రెండవ అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో ఓ మహిళ ఒంటరిగా ఉంటోంది. మూడు రోజుల క్రితం మహిళ ఫ్లాట్‌లోకి ప్రవేశించిన కిష్న ఆమె గదిలోకి వెళ్లి మూత్ర విసర్జన చేయటం మొదలుపెట్టాడు. ఇది గమనించిన ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో అతడు బయటకు పరుగులు తీశాడు. కొద్దిసేపటి ఛేజింగ్‌ తర్వాత పొరుగిళ్ల వారికి అతడు దొరికాడు.

ఆమె కిష్నకు వార్నింగ్‌ ఇచ్చి వదిలేసింది. అందరి ముందు తనను అవమానించటంతో సోనెకర్‌ ఆమెపై పగ పెంచుకున్నాడు. శుక్రవారం తాగిన మత్తులో బాధితురాలి ఇంట్లోకి చొచ్చుకెళ్లి హత్యాప్రయత్నం చేశాడు. అతడి నుంచి తప్పించుకున్న ఆమె సహాయం కోసం కేకలు వేసింది. దీంతో నిందితుడు సెకండ్‌ ఫ్లోర్‌లోని గదిలోంచి బయటకు దూకాడు. కాలు విరగటంతో పాటు మరికొన్ని స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. చికిత్స కోసం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకుని,  దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి : పోలీసుల్ని చితక్కొట్టిన మందుబాబులు..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top