Madanapalle Double Murder Case: ఖైదీలను హడలెత్తిస్తున్న పద్మజ! - Sakshi
Sakshi News home page

ఖైదీలను హడలెత్తిస్తున్న పద్మజ! 

Feb 2 2021 8:54 PM | Updated on Feb 3 2021 5:06 PM

Madanapalle Case Sub Jail Prisoners Afraid Of Padmaja Behaviour - Sakshi

రోజు అర్ధరాత్రి తల్లి పద్మజ శివుడినంటూ కేకలు వేస్తూ గుండ్రంగా తిరుగుతూ కిందపడిపోయినట్టు తోటి ఖైదీల ద్వారా తెలిసింది. పురుషోత్తం నాయుడు అప్పుడప్పుడూ తనలో తాను కుమిలిపోతూ, బిగ్గరగా ఏడుస్తున్నాడని సమాచారం.

మదనపల్లె : ‘ఏ సమయంలో ఏం జరుగుతోందనని ఆందోళనగా ఉంది. మూడు రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం’ అని మదనపల్లె సబ్‌జైలులోని ఖైదీలు ములాఖత్‌కు వచ్చిన కుటుంబీకుల వద్ద వాపోయారు. కోవిడ్‌–19 నేపథ్యంలో 9 నెలలుగా నిలిపివేసిన రిమాండ్‌ ఖైదీలతో ములాఖత్‌ను సోమవారం నుంచి ప్రారంభించారు. దీంతో జైలులో ఉన్న తమ వారిని కలుసుకునేందుకు ఖైదీల కుటుంబ సభ్యులు సబ్‌జైలుకు వచ్చారు. ములాఖత్‌ అనంతరం వారు బయటకు వచ్చి జైలులో ఉన్న తమ వారు భయపడుతున్నట్టు చెప్పారు.

కుమార్తెలను హత్యచేసిన కేసులో నిందితులైన తల్లిదండ్రులు పురుషోత్తంనాయుడు, పద్మజ జనవరి 26 నుంచి అదే సబ్‌ జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. 26న రాత్రి పద్మజ ‘నేను శివుణ్ణి. కాళికను’ అని బిగ్గరగా అరుస్తూ తోటి ఖైదీలతో పాటు సబ్‌జైలు సిబ్బందిని హడలెత్తించినట్లు సమాచారం. రోజు అర్ధరాత్రి తల్లి పద్మజ శివుడినంటూ కేకలు వేస్తూ గుండ్రంగా తిరుగుతూ కిందపడిపోయినట్టు తోటి ఖైదీల ద్వారా తెలిసింది. పురుషోత్తం నాయుడు అప్పుడప్పుడూ తనలో తాను కుమిలిపోతూ, బిగ్గరగా ఏడుస్తున్నాడని సమాచారం. (చదవండి:  భూతవైద్యుడి ఎంట్రీ.. కేసు కీలక మలుపు)

దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని.. 
నిందితులను చికిత్స నిమిత్తం విశాఖకు తరలిస్తే కేసు దర్యాప్తునకు ఆటంకం ఏర్పడుతుందనే ఉద్దేశంతో స్థానిక పోలీసులు ఎస్కార్ట్‌ పోలీసులపై ఒత్తిడి తెచ్చి ఆలస్యం చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో నిందితుల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరుతూ స్థానిక న్యాయవాది ఒకరు జేఎఫ్‌సీఎం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్టు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement