కస్టమర్‌లా వచ్చి.. సిబ్బందితో మాట కలిపి..

Hyderabad: woman Theft Gold Bangles In Jewellery - Sakshi

సాక్షి,బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 36లోని తనిష్క్‌ జువెలర్స్‌లో చోరీ జరిగింది. కస్టమర్‌లా వచ్చిన ఓ మహిళ బంగారు గాజును తస్కరించింది. వివరాలివీ... జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 36లోని తనిష్క్‌ జువెలర్స్‌లో ఈ నెల 9న గుర్తు తెలియని మహిళ వచ్చింది. తాను బంగారు గాజులు కొనాలనుకుంటున్నట్లు సిబ్బందికి చెప్పింది. దీంతో కొన్ని రకాల డిజైన్లను చూపించారు. వివిధ గాజులను పరిశీలించిన ఆ మహిళ తనకు మరికొన్ని డిజైన్లు చూపించాలని కోరింది.

ఆయా గాజుల ధరలను అడుగుతూ సిబ్బందితో మాట కలిపి దృష్టి మరల్చి ఒక బంగారు గాజును తస్కరించింది. తర్వాత తనకు డిజైన్లు నచ్చలేదని చెప్పి బయటకు వెళ్లిపోయింది. మరుసటిరోజు సిబ్బంది ఆభరణాలను లెక్కించే సమయంలో 18 గ్రాముల బరువైన బంగారు గాజు తగ్గినట్లు గుర్తించారు. సీసీ కెమెరా ఫుటేజీలను జల్లెడ పట్టగా గుర్తుతెలియని మహిళ చోరీ చేసినట్లు తేలింది. ఈ మేరకు శుక్రవారం తనిష్క్‌ ప్రతినిధి ప్రవీణ్‌కుమార్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలి కోసం గాలింపు చేపట్టారు.

చదవండి: రూ.2లక్షల అప్పు.. భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం.. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top