అప్పు తిరిగి చెల్లించమన్నందుకు స్నేహితులతో కలిసి..

Hyderabad: Man Asks Friends To Return Money Assassinated - Sakshi

సాక్షి, బహదూర్‌పురా( హైదరాబాద్‌): తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమన్నందుకు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన కాలాపత్తర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సుదర్శన్‌ తెలిపిన వివరాల ప్రకారం... కాలాపత్తర్‌ పీఎస్‌ పరిధిలోని ఖాజిపురా ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ సాధిక్‌  (36) కాలాపత్తర్‌ ప్రాంతానికి చెందిన సాధిక్‌ బిన్‌ యెమన్‌కు కొంత డబ్బును అప్పుగా ఇచ్చాడు.ఇలా తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించాలని సాధిక్,  యెమన్‌ను అడిగాడు.

దీంతో యెమన్‌ అతని స్నేహితులతో కలిసి సాధిక్‌ను హత్య చేసేందుకు పథకం పన్నాడు. అందులో భాగంగానే ఆదివారం సాధిక్‌కు డబ్బులు చెల్లిస్తానని ఫోన్‌ చేసి పిలిపించాడు. డబ్బు కోసం వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన సాధిక్‌ను యెమన్‌ కాలాపత్తర్‌ బిలాల్‌నగర్‌లోని తన నివాసంలోకి తీసుకెళ్లాడు. అనంతరం సాధిక్‌ను స్నేహితులతో కలిసి యెమెన్‌ దారుణంగా హత్య చేశారు. సోమవారం ఈ హత్య విషయం బయటపడటంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న కాలాపత్తర్‌ పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడిన నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top