Girl Death Mystery: Mother lover Assassinated Prasanthi In Prakasam District - Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం.. ప్రశ్నిస్తోందనే హత్య!

Nov 28 2021 3:12 PM | Updated on Nov 28 2021 5:14 PM

Girl Death Mystery: Mother lover Assassinates Prasanthi In Prakasam District - Sakshi

కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ కండే శ్రీనివాసులు

సాక్షి, కందుకూరు: లింగసముద్రంలో అత్యంత దారుణంగా హత్యకు గురైన విద్యార్థిని ప్రశాంతి(15) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని, ఆర్థిక లావాదేవీలను ప్రశ్నిస్తుందనే కారణంతో తల్లితో సహజీవనం చేస్తున్న శ్రీకాంత్‌ అనే వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేల్చారు. ఈ మేరకు శనివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కండే శ్రీనివాసులు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

డీఎస్పీ కథనం ప్రకారం.. వేటపాలేనికి చెందిన ఈసునూరి మాధవి 15 ఏళ్లుగా లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెంలో ఏఎన్‌ఎంగా పనిస్తోంది. విభేదాల కారణంగా భర్తతో పాటు ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా కూతురు ప్రశాంతితో కలిసి లింగసముద్రతో నివాసం ఉంటోంది. తన ఇంటి కింద పోర్షన్‌లో నివాసం ఉంటున్న జంగారెడ్డిపాలేనికి చెందిన వివాహితుడైన సుంకర శ్రీకాంత్‌తో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రస్తుతం ఇద్దరూ కలిసి సహజీవనం సాగిస్తున్నారు.

చదవండి: కూతురు కర్కశం.. కన్నతల్లి అని కనికరం లేకుండా..

దీనికి శ్రీకాంత్‌ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎటువంటి అభ్యంతరం లేకపోవడంతో కలిసే జీవిస్తున్నారు. మాధవికి వచ్చే జీతాన్ని సైతం శ్రీకాంత్‌ కాజేయడం, ఆమె అకౌంట్‌లోని డబ్బులు డ్రా చేసుకొని తన అవసరాలు తీర్చుకోవడం శ్రీకాంత్‌కు పరిపాటిగా మారింది. ఈ విషయంలో ప్రశాంతి ఇటీవల తల్లిని ప్రశ్నించడం ప్రారంభించింది. 10వ తరగతి పూర్తి చేసిన ప్రశాంతి మంచి మార్కులతో నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించింది.

అక్కడ రూ.60 వేలు కట్టాల్సి వచ్చింది. మాధవి ఆ డబ్బును శ్రీకాంత్‌ను అడిగింది. ప్రశాంతి ఉంటే మాధవితో తన సంబంధం కొనసాగదని, ఆర్థిక విషయాల్లో తన బాగోతం బయటపడుతుందని భావించిన శ్రీకాంత్‌ ప్రశాంతిని చంపేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ నెల 23వ తేదీన ఉదయం 7గంటల సమయంలో ఇంట్లో నిద్రపోతున్న ప్రశాంతిని గొంతునులుమి చంపేశాడు.

చదవండి: ఆయుర్వేద మెడిసిన్‌ పేరిట అమెజాన్‌ ద్వారా భారీగా గంజాయి రవాణా 

శవాన్ని ఏం చేయాలో తెలియక ఆ రోజంతా ఇంట్లోనే ఉంచుకున్నారు. అర్ధరాత్రి సమయంలో తన స్నేహితుడైన గురుబ్రహ్నం, మాధవి, శ్రీకాంత్‌ కలిసి అటవీ ప్రాంతానికి శవాన్ని తరలించి పెట్రోల్‌, డీజిల్ పోసి తలగబెట్టారు. మరుసటి రోజు వెళ్లి శవం పూర్తిగా కాలకపోవడంతో మట్టివేసి కప్పి వచ్చారు. 

తల్లి సహకారంతోనే...
ప్రశాంతి కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మాధవి, శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీకాంత్‌ తల్లి ధనమ్మ ప్రోత్సాహం కూడా ఉంది. మాధవితో వివాహేతర సంబంధం కొనసాగింపు, ప్రశాంతిని హత్యచేసి తగలబెట్టడం వరకు శ్రీకాంత్‌కు ఆయన తల్లి ధనమ్మ సహకరించినట్లు పోలీసులు తేల్చారు.      

Advertisement
 
Advertisement
Advertisement