తల్లిని చంపిన కూతురు కేసులో కొత్త ట్విస్ట్‌

Doughter And Lover Kill Mother In Hyderabad - Sakshi

సాక్షి, రాజేంద్రనగర్‌(హైదరాబాద్‌): తల్లిని హత్య చేసిన కుమార్తెతోపాటు ప్రియుడిని రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసుల సమాచారం మేరకు... చింతల్‌మెట్‌ ప్రాంతానికి చెందిన యాదమ్మ(45), యాదయ్య భార్యాభర్తలు. వీరికి ముగ్గురు సంతానం. మొదటి కూతురుకు వివాహం చేయగా రెండవ కూతురు అనారోగ్యంతో మృతి చెందింది. చిన్న కూతురుతో కలిసి చింతల్‌మెట్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.

భార్యాభర్తలు ఇద్దరు కూలి పని చేస్తుంటారు. చిన్న కూతురు నందిని(19) ఇంటి వద్దే ఉంటుంది. ఇంటి పక్కనే గ్యాస్‌ ఏజెన్సీలో పని చేస్తున్న రామ్‌కుమార్‌(19)తో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తల్లిదండ్రులు కూలి పనికి వెళ్లగానే నందిని ప్రియుడికి ఫోన్‌ చేసి ఇంటికి రప్పించుకునేది. స్థానికులు ఈ విషయాన్ని తల్లికి తెలపడంతో మందలించింది. సెల్‌ఫోన్‌లో సైతం తరచు మాట్లాడుతుండటంతో వద్దని హెచ్చరించింది.

సోమవారం పని కోసం తల్లిదండ్రులు బయటకు వెళ్లగా ఫోన్‌ చేసి నందిని ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. పని దొరకకపోవడంతో తల్లి ఇరువురిని చూసి మందలించింది. ఇదే విషయమై తల్లి, కూతురు మధ్య గొడవ జరిగింది. ప్రియుడు, ప్రియురాలు ఇద్దరు కలిసి తల్లిపై దాడి చేసి చున్నీతో ఉరి వేశారు. అనంతరం తమకే ఏమీ తెలియనట్లు రామ్‌కుమార్‌ గ్యాస్‌ ఏజెన్సీలో పనికి వెళ్లగా ఇంట్లో కూతురు ఉంది.

స్థానికులు గొడవ విషయాన్ని రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బుధవారం ఇరువురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మొదట ఇద్దరు మైనర్లు అని 17 సంవత్సరాలు ఉన్నామని పోలీసులకు తప్పుదోవ పట్టించారు. ఆధార్, ఇతర సర్టిఫికెట్‌ల ఆధారంగా వారు మేజర్లని పోలీసులు నిర్ధారించారు. 

చదవండి: భార్యపై కోపంతో మ్యాట్రిమెునిలో వివరాలు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top