సోదరుడే కాలయముడై.. | Brother pushed his sister into pond | Sakshi
Sakshi News home page

సోదరుడే కాలయముడై..

Jan 25 2024 5:56 AM | Updated on Jan 25 2024 5:56 AM

Brother pushed his sister into pond - Sakshi

మైసూరు: ఇతర మతానికి చెందిన యువకుడిని ప్రేమించిందనే కోపంతో చెల్లిని సొంత అన్న చెరువులోకి తోసేయగా.. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన తల్లి కూడా జలసమాధి అయ్యింది. ఈ దారుణం మైసూరు జిల్లా హుణసూరు తాలూకా మరూరు గ్రామంలో జరిగింది. వివరాలు.. మరూరుకు చెందిన సతీశ్, అనిత(43) దంపతుల కుమారుడు నితిన్‌ కూలి పనులకు వెళ్తుండగా.. ధను శ్రీ(18) బీకాం రెండో సంవత్సరం చదువుతోంది.

ఈక్రమంలో మారూరుకు పొరుగున ఉన్న హనగోడు గ్రామానికి చెందిన ఇతర మతస్తుడైన యువకుడిని ధనుశ్రీ ప్రేమిస్తోంది. ఈ విషయం తెలిసిన నితిన్‌ తరుచూ ధనుశ్రీతో గొడవ పడేవాడు. మంగళవారం సాయంత్రం బంధువులకు బాగా లేదంటూ నితిన్‌ బైక్‌పై తన సోదరి ధనుశ్రీని, తల్లి అనితను బయటకు తీసుకెళ్లాడు. ఊరి బయట ఉన్న చెరువు వద్ద ధనుశ్రీ ప్రేమ విషయమై వారి మధ్య గొడవ జరిగింది.

ఇంతలో పట్టరాని కోపంతో నితిన్‌ తన చెల్లి చేతులను టవల్‌తో కట్టేసి చెరువులోకి తోసేశాడు. ఆ వెంటనే కుమార్తెను కాపాడుకునేందుకు తల్లి అనిత కూడా చెరువులోకి దూకింది. దీంతో తల్లిని రక్షించేందుకు నితిన్‌ నీటిలోకి దూకాడు. కానీ తల్లీకూతురు నీళ్లలో మునిగి మరణించారు. ఆ తర్వాత నితిన్‌ ఇంటికి వచ్చి తండ్రి సతీశ్‌కు ఈ విషయం తెలియజేశాడు. బుధవారం ఉదయాన్నే గ్రామస్తులు, ఫైర్‌ సిబ్బంది చెరువులో గాలించి అనిత, ధనుశ్రీ మృతదేహాలను బయటకు తీశారు. హుణసూరు రూరల్‌ పోలీసులు నితిన్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement